పూలమకరందాన్ని సేవించి తేనెటీగలు ఉత్పత్తి చేసే తియ్యటి తేనె ఎన్ని ఔషధ ప్రయోజనాలు కలిగి ఉందో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పబోయే తేనె మాత్రం అత్యంత విషపూరితమైనది. అయితే దీన్ని కూడా పలు చికిత్సల్లో ఉపయోగిస్తారు. అలాగని నేరుగా సిప్ చేశారో అంతే పరిస్థితి.
ఆ మధువే..మ్యాడ్ తేనే. ఇది మాదకద్రవ్య ప్రభావాలు కలిగిన తేనె అట. ఇది కేవలం నేపాల్, టర్కీలలో ఉత్పత్తి అవుతుందట. హిమాలయ ప్రాంతాలలో జెయింట్ అనే తేనెటీగలు రోడోడెండ్రాన్ అనే పువ్వుల నుంచి ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో మాదక ద్రవ్య ప్రభావం తోపాటు, విషపూరితమైన గ్రేయానోటాక్సిన్లను కూడా కలిగి ఉంటుందట. ప్రాచీన గ్రీసులు ఈ మ్యాడ్ హానీని బయో వెపన్గా ఉపయోగించేవారట.
పురాతన గ్రీకు గ్రంథాల్లో గ్రీకు సైనిక నాయకుడు జెనోఫోన్ దీని గురించి రాశాడని చెబుతున్నాయి. అంతేగాదు క్రీస్తూ పూర్వం జనరల్ పాంపే ఆధ్వర్యంలో రోమన్ సైనికులపై జరిగిన మూడవ మిథ్రిడాటిక్ యుద్ధంలో రాజు మిథ్రిడేట్స్ మ్యాడ్ హనీని బయో వెపన్గా ఉపయోగించినట్లు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తేనె కామోద్దీపన కోరికలను పెంచుతుందట కూడా.
ఎలా సేకరిస్తారంటే..
మధ్య నేపాల్, ఉత్తర భారతదేశంతో సహా హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో వసంతకాలంలో లోయలలో రోడోడెండ్రాన్లు వికసించినప్పుడు తేనెటీగగలు ఈ బంగారు రంగు తేనెను ఉత్పత్తి చేస్తాయట. చెట్టుకొమ్మలపై సుమారు 1200 నుంచి, 4 వేల మీటర్ల ఎత్తులో కనిపిస్తాయట. నేపాల్లోని గురుంగ్ అనే తెగ వారు ఈ మ్యాడ్ తేనెని సేకరిస్తారట. ఒకప్పడూ ఎక్కడపడితే అక్కడ దర్శనమిచ్చే ఈ తేనెతుట్టలు..ఇప్పుడు ఆనకట్ట నిర్మాణాల కారణంగా కనుమరుగవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.
ప్రయోజనం, ప్రమాదం రెండూ ఉన్నాయి..
దీన్ని కామోద్దీపనంగా, జీర్ణశయాంతర రుగ్మతలకు(పెప్టిక్ అల్సర్ వ్యాధి, డిస్స్పెప్సియా, గ్యాస్ట్రిటిస్, రక్తపోటు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేగాదు గొంతునొప్పి, ఫ్లూ, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. అలాగని ఆ తేనెని సిప్ చేశారో ఇక అంతే..
టెక్సాస్ ఇన్స్టిట్యూట్ జర్నల్లో ప్రచురితమైన ఒక కేసులో.. ఓ భార్యభర్తలు తమ దాంపత్యం మరింత బాగుండాలని ఈ తేనెని ఒక వారం పాటు తీసుకున్నారు. ఫలితంగా రెండు గంటల్లోనే తీవ్రమైన ఇన్ఫీరియర్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (రక్త ప్రవాహంలో ఆకస్మిక అడ్డంకి వల్ల కలిగే గుండెపోటు)తో ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఇది రక్తపోటుని పడిపోయేలా చేసి, శాసకోశ సమస్యలు, తలతిరగడం, వంటి ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఒక్కోసారి కండరాల పక్షవాతం, అట్రియోవెంట్రిక్యులర్ బ్లాక్లు, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి కూడా. అందువల్లే ఈ తేనెని టేస్ట్ చేయాలంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో, వారి సలహాలు సూచనల మేరకు ట్రై చేయాలే తప్ప..నేరుగా సిప్ చేసే సాహసం చేశారో.. ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే.
(చదవండి: మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..)


