పురుగుమందులు విఫలం.. పంట మార్పిడి సఫలం! | Sagubadi: Crop Rotation Reduces Pests And Pesticide Use | Sakshi
Sakshi News home page

పురుగుమందులు విఫలం.. పంట మార్పిడి సఫలం!

Aug 14 2026 8:27 AM | Updated on Aug 14 2026 9:31 AM

Sagubadi: Crop Rotation Reduces Pests And Pesticide Use

సాగుబడి

పంటలను వ్యాధులు, తెగుళ్ల నుంచి కాపాడుకోవటానికి నేడు చాలా మంది రైతులు క్రిమిసంహారక రసాయనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, మితిమీరిన రసాయనాల వాడకం అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా, రైతులపై పెట్టుబడి భారాన్ని విపరీతంగా పెంచుతోంది. ఒడిశాలోని సినాపాలి బ్లాక్‌ బార్‌గావ్‌ గ్రామానికి చెందిన రైతు మురళీధర్‌ నాయక్‌ అనుభవాలే దీనికి స్పష్టమైన నిదర్శనం. ఈ రైతు అనుభవాన్ని ప్రాతిపదికగా చేసుకొని, ప్రస్తుత వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల పరిమితులు, పంట మార్పిడి ప్రాముఖ్యతను వివరించే కథనం.

మురళీధర్‌ తన 2.5 ఎకరాల పొలంలో బిందు సేద్యం (డ్రిప్‌), సోలార్‌ పంప్, ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలతో టొమాటోలు, వంకాయలు, పుచ్చకాయలను ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. కానీ, ఇటీవలి భారీ వర్షాలు, నీటి పారుదల సమస్యల కారణంగా ఆయన టొమాటో పంటకు ‘ఎండు తెగులు’ సోకింది. పంటను కాపాడుకోవటానికి వేల రూపాయలు వెచ్చించి ఎంతగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రాలేదు.

పంట మార్పిడే శాశ్వత పరిష్కారం
ఈ రసాయన వ్యర్థాల చక్రబంధం నుంచి బయటపడటానికి ‘పంట మార్పిడి’ ఒక్కటే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఒకే భూమిలో ప్రతి సీజన్‌లో లేదా ప్రతి ఏటా వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయటం వల్ల తెగుళ్ల జీవచక్రం తెగిపోతుంది. ఉదాహరణకు: పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు. దీనివల్ల నేలలో వ్యాధికారక క్రిముల ఉనికి తగ్గి, మట్టి సారవంతమవుతుంది.

జైవిక సమతుల్యతే కీలకం
డ్రిప్‌ ఇరిగేషన్, ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వంటి సాంకేతికతలు నీటిని, శ్రమను ఆదా చేయగలవు. కానీ నేలలో జీవ సంబంధమైన సమతుల్యతను పునరుద్ధరించలేవు. పంటకు తెగులు రాగానే రసాయనిక పురుగు మందుల వాడటం వల్ల ఖర్చు పెరగటమే తప్ప పంట దిగుబడి పెరగదు. సాంకేతికతతో పాటు నేల స్వభావానికి అనుగుణంగా ‘పంట మార్పిడి’ పద్ధతిని పాటించటమే రైతుల ఆర్థిక భద్రతకు, సుస్థిర దిగుబడులకు అసలైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ ప్రధాన పంట కుటుంబాలు
తెగుళ్ల చక్రాన్ని తెగ్గొట్టి వాటి తీవ్రతను తగ్టించటానికి, భూసారాన్ని పరిరక్షించటానికి వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయాలి. ప్రధాన పంట కుటుంబాలు, వాటి ఉదాహరణలు...

  • పప్పుధాన్యాలు (లెగ్యుమినేసి / ఫాబేసే): పెసర, మినుము, కంది, బఠాణీలు, శనగలు, వేరుశనగ తదితర పప్పుధాన్యాలు. ఇవి నేలలో నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి.

  • ధాన్యపు పంటలు (గ్రామినేసి / పోయేసే): వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి తదితరాలు.

  • బంగాళదుంప కుటుంబం (సోలనేసే): టొమాటో, వంగ, మిరప, బంగాళదుంప తదితరాలు.

  • ఆవాలు/ క్యాబేజీ కుటుంబం (బ్రాసికేసే / క్రసిఫెరే): క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, ఆవాలు, బ్రోకలీ తదితరాలు.

  • తీగజాతి కూరగాయలు (కుకుర్బిటేసే): గుమ్మడి, దోస, కాకర, సొరకాయ, కీర తదితరాలు.

  • క్యారెట్‌ కుటుంబం (అంబెలిఫెరే / అపిసే): క్యారెట్, కొత్తిమీర తదితరాలు.

ఈ విధంగా ఒక కుటుంబానికి చెందిన పంట తర్వాత వేరే కుటుంబానికి చెందిన పంటను వేయటం వల్ల ఒకే రకమైన తెగుళ్లు లేదా పురుగులు ఆశించకుండా వాటి జీవచక్రం తెగిపోతుంది.

రసాయనాలకు లొంగని తెగుళ్లు: అసలు కారణం ఏమిటి?
ఉద్యానవన శాఖ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టొమాటోలు, వంకాయలు, బంగాళాదుంపలు, మిరప కాయలు వంటివి ఒకే ‘సోలనేసి’ అనే వృక్ష కుటుంబానికి చెందిన పంటలు. ఒకే పొలంలో వరుసగా ఒకే కుటుంబానికి చెందిన పంటలను సాగు చేయటం వల్ల ఆ నేలలో వ్యాధికారక శిలీంధ్రాలు, బాక్టీరియాల తీవ్రత భారీగా పెరిగిపోతుంది. ఒకసారి నేల ద్వారా సంభవించే ఎండు తెగులు తీవ్రత పెరిగితే, ఎలాంటి క్రిమిసంహారక రసాయనాలు చల్లినా పెద్దగా ప్రయోజనం ఉండదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement