
మనసు లేని వాళ్లు చూపు ఉన్నప్పటికీ...సమాజాన్ని చూడలేరు. మనసు ఉన్న వాళ్లు చూపు లేకపోయినప్పటికీ సమాజాన్ని చూస్తారు. సమాజానికి తమ వంతుగా తోడ్పడతారు. అలాంటి ఒక యువకుడు పంచగుడి మహేశ్...
తన కళ్లే తనకు సహకరించవు. అడుగు దూరం దాటి ఏమీ చూపించవు. రెండో అడుగు నుంచి అంతా చిమ్మచీకటే. అయినా...ఏదో ‘వెలుగు’ను చేరుకోవాలన్న తపన తనను నడిపిస్తోంది. ‘నాకు చూపొక్కటే సమస్య అన్నా..’ అని సింపుల్గా తన అంధత్వాన్ని కొట్టిపారేస్తాడు. ‘సమస్య లేని మనిషి ఉంటడా..!’ అంటూ తన సమస్యను లైట్గా తీసుకోమంటాడు మహేశ్.
మనసుతో చూస్తాడు!
మహేశ్కు కంటిచూపు లేదు. అందుకే ఆయన మనసుతో చూస్తున్నాడు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి మహేశ్ తాను నెలకొల్పిన ‘దివ్యాంగశక్తి ఫౌండేషన్ ద్వారా సమాజసేవ చేస్తున్నాడు. ఇటీవల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వితంతువుకు రెండుగదుల ఇంటిని నిర్మించి ఇచ్చాడు.
వాలేగాం టు నాందేడ్
వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి అనూషబాయి, లక్ష్మణ్ దంపతులకు మహేశ్, శ్రీకాంత్ కుమారులు, భాగ్యశ్రీ కుమార్తె. పెద్దకొడుకైన మహేశ్కు అడుగు దూరం వరకు అది కూడా ఒక కన్ను ఐదు శాతమే కనిపిస్తుంది. రెండో కుమారుడు శ్రీకాంత్కు ఐదేళ్ల వయసులో వచ్చిన అనారోగ్య సమస్యతో రెండు కళ్లూ దెబ్బతినడంతో పూర్తిగా అంధుడయ్యాడు.
వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అనూష–లక్ష్మణ్ దంపతులు తమ కొడుకులను బాగా చదివించాలనుకున్నారు. మహేశ్ మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకాలోని బొదిడి అంధుల పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. ఇంటర్, బీకామ్ డిగ్రీ నాందేడ్ జిల్లాలోనే పూర్తిచేశాడు. నాందేడ్లో ఉన్నప్పుడే దివ్యాంగుల కోసం ఏర్పాటైన ‘సక్షమ్’ సంస్థలో చురుకుగా పనిచేశాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు.
దివ్యాంగిశక్తి ఎంటర్ప్రైజెస్
నాందేడ్ నుంచి వచ్చిన మహేశ్ నిర్మల్ జిల్లాలో ‘సక్షమ్’ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాడు. మిత్రుల సూచన మేరకు బెంగళూరులో ఒకేషనల్ ట్రైనింగ్కు వెళ్లాడు. 2016లో తన ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ తయారు చేశాడు. తెలిసినవాళ్లకు విక్రయించాడు. మంచి స్పందన రావడంతో 2017లో ‘దివ్యాంగశక్తి ఎంటర్ప్రైజెస్’ పేరిట భైంసా మండలం మాటేగాం గ్రామంలో చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇందుకు పీఎంఈజీపీ నుంచి రూ.15 లక్షల ఆర్థికసాయం అందడం తోడైంది. ఈ యూనిట్లో ‘దివ్యాంగశక్తి’ పేరిట ఫ్లోర్క్లీనర్ నుంచి గ్లాస్ క్లీనర్స్ వరకు ఎన్నో తయారు చేస్తున్నాడు. వీటితో పాటు బయోడిగ్రేడబుల్ కవర్స్ విక్రయిస్తున్నాడు. నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తన ప్రొడక్ట్స్ను మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈ యూనిట్ ద్వారా తాను ఉపాధి పొందడంతోపాటు మరో ఆరుగురికి ఉపాధి అందిస్తున్నాడు.
– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్, ఫొటోలు: బాతూరి కైలాష్
దివ్యాంగ శక్తి... తన వ్యాపారసంస్థ ‘దివ్యాంగశక్తి’ పేరిటనే 2021లో ఫౌండేషన్ ప్రారంభించాడు మహేష్. సమాజానికి తన వంతుగా కొంత ఇవ్వాలి అనేది అతడి విధానం. తన ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, అనాథలు, వృద్ధులకు సేవలు అందిస్తున్నాడు.
మూడేళ్లుగా పది, ఇంటర్ పాసైన దివ్యాంగులకు సహకారం అందిస్తున్నాడు. వారి కోసం పరీక్షలు రాసిచ్చే వారిని సన్మానిస్తున్నాడు. సర్కారు బడి పిల్లలకు ఉచితంగా బ్యాగులు అందిస్తున్నాడు. ఇటీవల చుచుంద్ గ్రామంలో రూ.30వేలు ఖర్చుచేసి వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేశాడు.
(చదవండి: సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లండిలా..!)