ఒంటిపై పోలీస్డ్రెస్.. మనసు వెన్న. ఎదుటి వారికి చిన్నపాటి సమస్య వచ్చిన వెన్నెలా కరిగిపోతారు. వారి కష్టాలను దూరం చేసేందుకు తమకు చేతనైనంత సహాయం చేస్తుంటారు. ఒకరేమో జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఎస్బీ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మరొకరు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న భీమనపల్లి పృథ్వీరాజ్. వృత్తిరీత్య పోలీస్ ఉద్యోగం చేస్తున్నా సేవే ప్రవృత్తిగా ముందుకెళ్తున్నారు.
కష్టాల వింటే కరిగిపోతారు..
జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్బీ ఏఎస్సైగా పనిచేస్తున్న రాజేశుని శ్రీనివాస్ సామాజిక సేవలో ముందుంటున్నారు. 1989లో కానిస్టేబుల్గా విధుల్లో చేరిన శ్రీనివాస్ 2012లో హెడ్కానిస్టేబుల్గా 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. జగిత్యాల వాసవి వివాహ వేదిక పేరుతో ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా ఇప్పటి వరకు 415కు పైగా వివాహాలు చేశారు. జాబితాపూర్లో వాసవి వృద్ధాశ్రమం నిర్మాణానికి సొంతంగా 25 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఇక్కడ వృద్ధాశ్రమం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయం
రాజేశుని శ్రీనివాస్ వాట్సాప్ గ్రూపు ద్వారా 56 మంది ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.35,54,945 విలువ గల సహాయం అందించారు. అలాగే సేవాదళ్ వాట్సాప్ గ్రూపు ద్వారా అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.7.60 లక్షల ఆర్థిక సహాయం అందించారు. నిరుపేదలైన 198 మంది వధువులకు పుస్తెమెట్టెలు, వివాహ సామగ్రి అందించారు.


