
అమ్మకు న్యాయం
మాతృత్వానికి సిద్ధపడిందంటే స్త్రీ.. 24 బై 7 డ్యూటీకి సైన్ చేసినట్టే! ఆ కొలువుకు ఆ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది! శారీరకంగా, మానసికంగా ఎన్ని మార్పులు.. ఎన్ని సర్దుబాట్లను అంగీకరించాలి అమ్మ!?
వర్కింగ్ ఉమన్ అయితే.. చెప్పక్కర్లేదు! ఆ శ్రమ నుంచి పాలిచ్చే మొదటి ఆరునెలలైనా ఆ తల్లికి కాస్తంత వెసులుబాటు, విశ్రాంతి కావాలి కదా! తొలి చూలు, మలి చూలుకే అనే నిబంధనతో కాదు! అవసరమైతే మూడో ప్రసవానికి కూడా! సుప్రీం కోర్ట్ కూడా సరే అంది! అదేంటి ఆ అంశం కోర్ట్ దాకా వెళ్లిందా? అవును.. ఇటీవలే తీర్పు వచ్చింది. ఆ వివరాలు..
తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఉమా దేవికి 2006లో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. 2012లో టీచర్గా సర్కారు కొలువు వచ్చింది. అయితే భర్తతో వచ్చిన స్పర్థల కారణంగా 2017లో అతన్నుంచి విడాకులు తీసుకుంది ఆమె. పిల్లల కస్టడీని తండ్రికే ఇచ్చింది కోర్ట్. 2018లో ఉమాదేవి మళ్లీ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు గర్భం దాల్చింది. నెలలు నిండుతుండటంతో తొమ్మిది నెలల ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును తోసిపుచ్చారు పై అధికారి..
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల ప్రకారం.. ఒకరు లేక ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవు వర్తిస్తుందని, ఉమాదేవికి ఇది మూడో కాన్పు అదీ రెండో వివాహంతో కాబట్టి ప్రసూతి సెలవు ఇవ్వడం కుదరదని వివరణిస్తూ! నొచ్చుకున్న ఉమాదేవి మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించింది. ఆమెకు మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందేనని తీర్పిచ్చింది ఏకసభ్యధర్మాసనం. దాంతో ఉమాదేవి పై అధికారులు డివిజన్ బెంచ్ (ఇద్దరు సభ్యుల ధర్మాసనం)కి అపీల్ చేశారు.
డివిజన్ బెంచ్.. ఏకసభ్య ధర్మాసన తీర్పును కొట్టేస్తూ మెటర్నిటీ లీవ్కి ఉమాదేవి అర్హురాలు కాదని తీర్పు ఇచ్చింది. దాంతో ఉమాదేవి సుప్రీం కోర్ట్కు వెళ్లింది. ‘నా ఇద్దరు పిల్లలు నేను గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అవకముందు పుట్టారు. సర్వీస్లో చేరిన తర్వాత మెటర్నిటీ లీవ్కి అప్లయ్ చేసుకోవడం ఇదే మొదలు. అదీగాక మెటర్నిటీ లీవ్ అనేది మహిళ రీప్రొడక్టివ్ రైట్స్ కిందికి వస్తుంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కూడా దీన్ని గుర్తిస్తుంది’ అని వాదించింది. మూడు కాన్పులకు మెటర్నిటీ లీవ్ ఇవ్వడం అధిక సంతానాన్నిప్రోత్సహించినట్టవడమేకాదు రాష్ట్ర ఖజానాకూ భారమేననే వాదన వినిపించారు ప్రతివాదులు.
సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే..
మూడో ప్రసవానికీ మహిళ మెటర్నిటీ లీవ్కి అర్హురాలే! అది రెండో పెళ్లయినా సరే! మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగం చేసే గర్భిణీకి ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందే! ప్రసవాల సంఖ్యను బట్టో.. పునర్వివాహాల స్టేటస్ను బట్టో కాదు. వాటితో ఈ సెలవుకు సంబంధం లేదు. అధిక సంతానాన్ని, అధిక ఆర్థిక భారాన్ని నియంత్రించాలనే రాష్ట్ర ప్రభుత్వ (తమిళనాడు) నిబంధనలు ప్రశంసించదగ్గవే! అదే సమయంలో ప్రాథమిక హక్కు కోణంలో మహిళల రీ్ప్రొడక్టివ్ హెల్త్, వెల్ బీయింగ్నూ పరిగణనలోకి తీసుకోవాల్సిందే.. వాళ్ల హక్కును గౌరవించాల్సిందే!’ అంటూ స్పష్టమైన తీర్పునిచ్చింది.
మహిళలకు సంబంధించి ఇదొక విజయమే! ఎక్కడైనా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, రీప్రొడక్టివిటీ రైట్ ఉల్లంఘనకు గురైనా.. ఈ తీర్పును చూపించి ఆ హక్కును పొందవచ్చు.