
గూడు.. మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకూ ఎంతో అవసరం. అయితే ఒక్కో జీవిది ఒక్కో తరహా నిర్మాణ శైలి. ఆయా జీవుల అవసరాలను తీర్చేదిగా నిర్మాణం ఉంటుంది. వీటిల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన నిర్మాణ శైలి పక్షులదే.. వాటి నిర్మాణాలు పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లను సైతం ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి.
అయితే నగరీకరణలో భాగంగా పక్షుల జాడలు, వాటి గూళ్ల సంఖ్య రాను రాను కనుమరుగవుతున్నాయి. నగర శివార్లు, పల్లెటూళ్లు, అడవులకే పరిమితమైన వీటి గూళ్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని హెచ్సీయూలో సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. నగరంలో నివసించే నేటి తరం యువతకు పక్షులను జూ లోనో, పార్కుల్లో సందర్శించి ఆనందించడం అలవాటు. ఇక వాటి గూళ్ల సంగతి, వాటి నిర్మాణ శైలి చాలా మందికి తెలియకపోవచ్చు.
అలాంటి పక్షుల గూళ్లు పదుల సంఖ్యలో హెచ్సీయూ కేంద్రంగా కనిపిస్తుండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనేక రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారిన గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పక్షి గూళ్లకు నిలయంగా మారింది.
ప్రస్తుతం ఈ క్యాంపస్లో దాదాపు 233 రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వాటి గూళ్లను విద్యార్థులు తమ ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తున్నారు. క్యాంపస్లో వృక్ష సంపద పరిరక్షణే పక్షుల సంఖ్య పెరుగుదలకు కారణమని విద్యార్థులు, పలువురు సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.
(చదవండి: సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!)