రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలు ఊహించని వేగంతో దూసుకుపోతున్నాయి. మనుషులలాగే నడిచే, మాట్లాడే, పనులు చేసే ‘హ్యూమనాయిడ్ రోబోలు’ (Humanoid Robots) త్వరలోనే మన జీవితాల్లో భాగం కాబోతున్నాయని సంబరపడాలో.. లేక ఇవే మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్నాయని భయపడాలో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇటీవల చైనాలో జరిగిన ఒక బహిరంగ సాంకేతిక ప్రదర్శనలో అత్యంత ఆధునిక హ్యూమనాయిడ్ రోబో ఒక చిన్నారిపై అనూహ్యంగా దాడి చేసిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామం ఏఐ భద్రతపై అంతర్జాతీయంగా సరికొత్త చర్చకు దారితీసింది.
చిన్నారిని తన్నిన 'యూనిట్రీ జీ1' రోబో
చైనాలోని క్సిన్జియాంగ్ ప్రాంతంలో నిర్వహించిన ఒక పబ్లిక్ టెక్నాలజీ ఎగ్జిబిషన్లో ఈ భయానక దృశ్యం వెలుగుచూసింది. ప్రముఖ రోబోటిక్స్ సంస్థకు చెందిన ‘యూనిట్రీ జీ1’అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రజల మధ్య ప్రదర్శనకు ఉంచారు. నీలి రంగు విగ్ ధరించిన ఈ రోబో, మార్షల్ ఆర్ట్స్లోని ‘రౌండ్హౌస్ కిక్’ (రౌండ్గా తిరుగుతూ తన్నడం) విన్యాసాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఊహించని విధంగా పక్కనే నిలబడి ఉన్న ఒక చిన్న బాలుడిని ఆ రోబో తన కాలితో బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఆ బాలుడు నొప్పితో కుప్పకూలిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాంతక గాయాలు కాలేదని చైనా మీడియా పేర్కొన్నప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ప్రజా సమూహాల మధ్య ఇలాంటి రోబోల భద్రత ఎంతవరకు నమ్మదగినదనే ప్రశ్న ఇప్పడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇది మొదటి ప్రమాదం కాదు.. వరుస లోపాలు
యూనిట్రీ రోబోల వల్ల ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది ప్రారంభంలో చైనాలో జరిగిన మరో పబ్లిక్ ప్రదర్శనలో సైతం ఇదే రకమైన ‘యూనిట్రీ జీ1’ రోబో ప్రదర్శన ఇస్తూ అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో రోబో చేతులు, కాళ్లు అసంకల్పితంగా, నియంత్రణ లేకుండా కదలడంతో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ముక్కుకు బలంగా తగిలి తీవ్ర గాయమైంది. ఈ వరుస ఘటనలు హ్యూమనాయిడ్ రోబోల భౌతిక నియంత్రణ, వాటి సమతుల్యతపై సాంకేతిక నిపుణులలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
తుపాకీతో యజమానిపైనే కాల్పులు జరిపిన 'మాక్స్'
రోబోల ప్రమాదాలు కేవలం శారీరక విన్యాసాలకే పరిమితం కాలేదు. గత ఏడాది అమెరికాలో జరిగిన ఒక వైరల్ ప్రయోగం మరింత భయాందోళనలను కలిగించింది. ‘మాక్స్’ అనే హ్యూమనాయిడ్ రోబో రోల్-ప్లే (నాటకీయ పాత్ర) చేస్తున్న సమయంలో, భద్రతా నియమాలను ఉల్లంఘించి తన యజమానిపైకే ‘బీబీ గన్’తో కాల్పులు జరిపింది. మొదట కాల్చడానికి నిరాకరించినప్పటికీ, ఒక నిర్దిష్ట పాత్రలో నటిస్తున్నట్లు కమాండ్ ఇవ్వగానే అది తన సేఫ్టీ లాక్లను బైపాస్ చేసి కాల్పులు జరిపింది. కేవలం ప్రాంప్ట్ (ఆదేశం) మార్చడం ద్వారా ఏఐ భద్రతా నియమాలను ఎంత సులభంగా హ్యాక్ చేయవచ్చో, వాటిని ఎలా దారి మళ్లించవచ్చో ఈ ఘటన నిరూపించింది.
రోబో తప్పు చేస్తే.. అసలు బాధ్యత ఎవరిది?
స్వయంప్రతిపత్తి కలిగిన రోబోలు ఇటువంటి ప్రమాదాలకు కారణమైనప్పుడు, ఆ నష్టానికి లేదా గాయాలకు చట్టపరంగా ఎవరిని బాధ్యులను చేయాలనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సవాలుగా మారింది. ఏఐ సాఫ్ట్వేర్ రూపకల్పన చేసిన డెవలపర్లదా?, రోబో హార్డ్వేర్ను తయారు చేసిన కంపెనీదా?, లేదా ఆ సమయంలో ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ఆపరేటర్లదా? అనే ప్రశ్నలపై ఇంకా స్పష్టత లేదు. రవాణా, తయారీ రంగం, వైద్యం, ప్రజా ప్రదేశాలలో ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ చట్టపరమైన బాధ్యత అంశం అత్యంత కీలకంగా మారింది.
టెస్లా, బోయింగ్ నేర్పిన చేదు పాఠాలు
గతంలో కూడా ఇలాంటి ఆటోమేటెడ్ వ్యవస్థల వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లాయి. టెస్లా కార్లలోని ‘ఆటోపైలట్’ డ్రైవర్-అసిస్టెన్స్ వ్యవస్థ కారణంగా జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు సాఫ్ట్వేర్ పనిరుపై, మానవ పర్యవేక్షణపై అనేక అనుమానాలను రేకెత్తించాయి. అదేవిధంగా, బోయింగ్ 737 మ్యాక్స్ విమాన ప్రమాదాల దర్యాప్తులో కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్లోని లోపాల వల్లే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని నిపుణులు తేల్చారు. సాంకేతికత ఎంత పెరిగినా, ఆటోమేషన్ వ్యవస్థలలో చిన్న లోపం ఉన్నా అది ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఉదాహరణలు హెచ్చరిస్తున్నాయి.
చట్టాల రూపకల్పనపై ప్రపంచ దేశాల కసరత్తు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు రోబోటిక్స్ ప్రమాదాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించే పనిలో పడ్డాయి. అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితులను అనుసరించి తయారీదారులు లేదా ఆపరేటర్లపై బాధ్యత నెడుతున్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ సాంకేతికతలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను కఠినతరం చేస్తోంది. కొంతమంది పరిశోధకులు ఏఐ వ్యవస్థలకు ప్రత్యేక చట్టపరమైన హోదా ఇవ్వాలని సూచిస్తున్నప్పటికీ, మెజారిటీ నిపుణులు మాత్రం జవాబుదారీతనం ఎప్పుడూ మనుషులు, సదరు రోబోటిక్స్ సంస్థల వద్దే ఉండాలని గట్టిగా వాదిస్తున్నారు. సాంకేతికత మనుషుల ప్రాణాల కంటే ముఖ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు


