రోడ్డు ప్రమాదం కేసులో సంచలన తీర్పు!
గృహిణి మాత్రమే కాదు... దేశ నిర్మాణంలో భాగస్వామి
నెలకు రూ.30,000 పరిహారం వేరుగా లెక్కకట్టాలి
ప్రణయ్ సేధీ కేసు మార్గదర్శకాలకు ఇది అదనం
రోడ్డు ప్రమాద కేసుల్లో సత్వర న్యాయం దక్కాలని వ్యాఖ్య
ఇంటికి దీపం అని భావించే ఇల్లాలి సేవల విలువ ఎంత? భార్య రోడ్డు ప్రమాదంలో మరణిస్తే భర్తకు జరిగే లోటును ఎంత మొత్తంతో భర్తీ చేయవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం సమాధానమిచ్చింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చెల్లించే నష్ట పరిహారంలో భార్య అందించే కుటుంబ సేవలకు వేరుగా విలువకట్టి చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తం నెలకు రూ.30,000గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాద కేసుల్లో ఏడాది లోగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు పూర్వాపరాలు...
రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో 2017 నాటి సుప్రీంకోర్టు తీర్పు (ప్రణయ్ సేథీ తీర్పుగా పిలుస్తారు) మార్గదర్శకాలకు ఇది అదనం అని తెలిపింది. ‘‘ప్రణయ్ సేథీ కేసు విషయంలో చెప్పిన వాటికి భార్య మరణం వల్ల కుటుంబ సేవలకు కలిగే నష్టాన్ని అదనంగా చేరుస్తున్నాం. గృహిణికి ఇప్పుడైనా నేషన్ బిల్డర్ హోదా లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల ప్రగతిని పర్యవేక్షించాలని సత్వర న్యాయం దక్కేలా చేయాలని కోరింది.
సెక్షన్ 169 కింద ఇచ్చిన సమ్మరీ ప్రోసీజర్ను కచ్చితంగా అనుసరించడం ద్వారా బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ పోరాటం నుంచి ఉపశమనం పొందవచ్చునని తెలిపింది. నష్ట పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను అక్షర, భావ స్ఫూర్తితో అనుసరించాలని కోరింది. హోం మేకర్ అనగానే అందరికీ ఓ మహిళ రూపం కళ్ల ముందు మెదులుతుందని అయితే ఇది అన్ని సందర్భాలకూ వర్తించక పోవచ్చునని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో పేర్కొంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లోనో, దురదృష్టవశాత్తో పురుషుడు కూడా హోం మేకర్ పాత్ర పోషించే అవకాశాలు లేక పోలేదని తెలిపింది. వీరికి దక్కాల్సిన గౌరవం ఇస్తూనే ప్రస్తుత కేసులో మాత్రం భార్య అందించే కుటుంబ సేవలకు మాత్రమే విలువ కట్టామని వివరించింది.
ప్రణయ్ సేథీ తీర్పు ప్రకారం...
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నష్ట పరిహారం చెల్లింపు విషయంలో 2017 నాటి ప్రణయ్ సేథీ కేసు తీర్పు నిర్ణయాత్మకమైంది. ఈ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం బీమా కంపెనీలకు తప్పనిసరిగా మారింది ఈ తీర్పుతోనే. చని పోయిన వారు భవిష్యత్తులో ఎంత ఆదాయం సంపాదించగలరు అన్నదాన్ని ఎలా లెక్కించాలో ఈ తీర్పులో స్పష్టంగా వివరించారు. ఏ ఏ విషయాల్లో నష్టపరిహారం చెల్లించాలి, వేటిని మినహాయించాలి అన్నది కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.కే.సేక్రీ, జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డాక్టర్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రకారం...
⇒ నలభై ఏళ్ల లోపు వయసుండి శాశ్వత ఉద్యోగం కలిగి ఉన్న వారైతే...నష్టపరిహారంలో వారి వేతనంలో సగాన్ని ఆదాయంగా పరిగణించాలి (వేతనమంటే అన్ని రకాల పన్నులు మినహాయించిన తరువాతి మొత్తం)
⇒ నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కులైతే వేతనంలో 30 శాతాన్ని, యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు వారైతే 15 శాతాన్ని ఆదాయంగా పరిగణించాలి.
⇒ స్థిరమైన వేతనంతో సొంతంగా ఉద్యోగం కలిగి ఉండి నలభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే వేతనంలో 40 శాతాన్ని ఆదాయానికి జోడించాలి.
⇒ 2009 నాటి సరళ వర్మ, డీటీసీ కేసు మార్గదర్శకాల ప్రకారం నష్ట పరిహారం నుంచి వ్యక్తిగత ఖర్చులను మినహాయిస్తారు.
⇒ లాస్ ఆఫ్ ఎసెట్స్ (బతికి ఉంటే సంపాదించే అవకాశమున్న ఆస్తులు, ఆదాయం) కింద రూ.15,000, అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కింద రూ.15,000, భార్య/భర్త సాంగత్యాన్ని కోల్పోయినందుకు రూ.40,000 కూడా చెల్లించాల్సిన నష్టపరిహారాల జాబితాలోకి చేరుతుంది.
⇒ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రతి మూడేళ్ల కాలానికి పది శాతం చొప్పున పరిహారం పెరగాలి.
శిశుపాల్ వర్సెస్ సుర్జీత్
మోటారు వాహన ప్రమాద పరిహారానికి సంబంధించిన ‘శిశుపాల్ వర్సెస్ సుర్జీత్’ కేసులో దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది. ప్రమాదాల్లో గృహిణులు మృతి చెందినప్పుడు లేదా వికలాంగులుగా మారినప్పుడు వారి సేవలకు తగిన ఆర్థిక విలువ కట్టడం లేదన్న వాదనలు న్యాయస్థానం ముందుకొచ్చాయి. గృహిణులకు ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం లేనందున కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిహారం చెల్లింపుల్లో తక్కువ మొత్తాలను ఖరారు చేస్తున్న తీరును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... గృహిణుల సేవలకు కచ్చితమైన, గౌరవప్రదమైన విలువను ఆపాదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
పరిహారం లెక్కింపుపై స్పష్టమైన తీర్పు
బాధిత కుటుంబం కోల్పోయే ‘గృహ సంరక్షణ’ను ఇకపై ఒక స్వతంత్ర ప్రాతిపదికగా పరిగణించి పరిహారం లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన పరిహారాలకు అదనంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రమాద పరిహార క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 169 ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించింది. పరిహార కేసుల విచారణలు సకాలంలో పూర్తయ్యేలా, తీర్పులోని సూత్రాలు అమలయ్యేలా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. – సాక్షి, న్యూఢిల్లీ
పాతికేళ్ల క్రితం నాటి కేసు...
2001లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ కేసులో చివరకు 2026 జూన్ నెలలో తీర్పు వెలువడింది. జీపులు రెండు ఢీకొన్న ప్రమాదంలో కక్షిదారు భార్య మరణించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2024లో తీర్పునిస్తూ... బాధితుడికి, ముగ్గురు పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే బాధితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


