మొట్టమొదటి పూజలందుకోవలసిన దైవం.. వినాయకుడే
విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
ఆది దంపతులకు మానసపుత్రుడు.. ఓంకార స్వరూపుడు...
జ్ఞానానికి, వివేకానికి ప్రతీక.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..
కార్యసిద్ధిని ప్రసాదించే సిద్ధివినాయకుడు..
భక్తుల కోరికలను ఆలకించే మన గణపయ్య!
ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలంటే విఘ్ననాయకుడైన శ్రీగణేశుని అనుగ్రహం కావాల్సిందే. అందుకే దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ప్రారంభంలో తొలి పూజలందుకునే దైవం వినాయకుడే.
విఘ్నేశ్వరుని ఆరాధన కేవలం విఘ్నాలను తొలగించమని కోరడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం, అహంకారం, అసహనం, తొందరపాటు వంటి అంతర్గత విఘ్నాలను తొలగించి, మంచి ఆలోచన, వివేకం, ఏకాగ్రత, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కూడా.
పసుపు గణపతి – పవిత్రతకు ప్రతీక
పార్వతీమాత చేతుల మీదుగా పసుపు ముద్దతో అవతరించి, మన ఇళ్లలో ‘‘పసుపు గణపతి’’గా తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్ననివారకుడే కాక, విద్య, బుద్ధి, జ్ఞానాలను ప్రసాదించే జ్ఞానప్రదాతగా కూడా ఆరాధించబడుతున్నాడు.అందుకే, ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ...
ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!’ అంటూ మనం గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.
వినాయక చవితి – భక్తి, ఆనందాల పర్వదినం
భాద్రపద శుద్ధ చవితి అనగానే ప్రతి ఇంటా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది. పండుగల ద్వారా మనం కేవలం ఆచారాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కూడా తరువాత తరాలకు అందిస్తాం. అందుకే పిల్లలను పూజలో భాగస్వాములను చేసి, గణపతి తత్వాన్ని వారికి పరిచయం చేయడం, వినాయకుని కథ చదివించడం లేదా చదివి వినిపించడం ఎంతో ముఖ్యం.
వినాయక వ్రతం – మనలోని మంచి గుణాలకు నాంది
సకల విఘ్నాలకు అధిపతియైన విఘ్నేశ్వరుడిని భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది పొడవునా విజయవంతంగా సాగాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామిని ప్రార్థిస్తాం.
అయితే భక్తితో కొలుస్తూ మనం కోరేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వమని.. వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వమని.. ఎదురయ్యే విఘ్నాలను ధైర్యంగా అధిగమించే శక్తి ఇవ్వమని.. కుటుంబంలో సుఖశాంతులు కలిగించమని.. సమాజంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని.. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.
ఇదే వినాయకవ్రతంలో అంతర్లీనంగా ఉన్న పరమార్థం.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. బుద్ధిని ప్రసాదించే బుద్ధిప్రదాత..
విజయాన్ని అందించే సిద్ధివినాయకుడు.. మంగళాలను చేకూర్చే మంగళమూర్తి..
శ్రీ గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ...
శ్రీ గణేశాయ నమః!
శ్రీ సిద్ధివినాయకాయ నమః! శ్రీ విఘ్నేశ్వరాయ నమః


