తండ్రి ప్రేమకు, వైద్యుల నైపుణ్యానికి అద్దం పట్టే సంఘటన ఇది. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి, వర్ధమాన బౌలర్కు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా 'ప్రీ-ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్' (డయాలసిస్ అవసరం లేకుండానే చేసే మూత్రపిండ మార్పిడి) నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ప్రాణరక్షణ ప్రక్రియలో బాలుడి తండ్రి తన ఒక మూత్రపిండాన్ని దానం చేసి పితృప్రేమను చాటుకున్నారు.
విరాట్ కోహ్లీని ఆరాధిస్తూ, భవిష్యత్తులో మంచి బౌలర్గా రాణించాలనుకుంటున్న ఈ 16 ఏళ్ల యువకుడు, పుట్టుకతోనే మూత్రనాళ సమస్య తో బాధపడుతుండేవాడు. దీనివల్ల మూత్రం వెనక్కి ప్రవహించి (యూరినరీ రిఫ్లక్స్) క్రమంగా కిడ్నీల పనితీరు దెబ్బతింది. శారీరక ఎదుగుదల ఆగిపోయి, చివరకు పరిస్థితి తీవ్రరూపం దాల్చి 'ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్' (ESRD)కి దారితీసింది.
దీర్ఘకాలిక డయాలసిస్ సమస్య నుంచి కాపాడేందుకు, ముందుజాగ్రత్త చర్యగా 'ప్రీ-ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్' చేయాలని వైద్యులు సూచించారు. ఇది రోగికి మెరుగైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును అందిస్తుంది. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి ఖాజా అసీముద్దీన్, ఏమాత్రం సంకోచించకుండా తన మూత్రపిండాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
అన్ని రకాల క్లినికల్ పరీక్షలు, డానర్ మ్యాచింగ్ పూర్తయిన తర్వాత, 2026 జూన్ 17న శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతర సంరక్షణ తర్వాత, రోగి వేగంగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఈ మేరకు ఏఐఎన్యూ (AINU) బంజారాహిల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ & ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి మాట్లాడుతూ: "చిన్న పిల్లలు, యుక్తవయస్కుల్లో ఇవి తీవ్ర రూపం దాల్చినప్పుడు, డయాలసిస్ కంటే ముందే చేసే కిడ్నీ మార్పిడి వారి సాధారణ ఎదుగుదలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు ఎంతగానో తోడ్పడుతుంది.
మహమ్మద్కి చేసిన ఈ విజయవంతమైన శస్త్రచికిత్స, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం, తండ్రి ఉదారత కలసి ఒక వికసిస్తున్న జీవితానికి ఎలా వెలుగునివ్వవచ్చో నిరూపించింది" అని తెలిపారు. కాగా ఆ బాలుడు, తన చదువుపై దృష్టి సారించాడమే గాక మళ్లీ మైదానంలోకి దిగి బౌలింగ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు.
(చదవండి: మోడల్స్గా మావోయిస్టు మహిళలు..!)


