ఎవల్యూషన్‌ డే’ని జరుపుకొందాం! | Evolution Day on November 24th Special Story | Sakshi
Sakshi News home page

ఎవల్యూషన్‌ డే’ని జరుపుకొందాం!

Feb 17 2025 1:48 PM | Updated on Feb 17 2025 2:58 PM

Evolution Day on November 24th Special Story

ఇంగ్లిష్‌ నేచురలిస్ట్‌ ఛార్లెస్‌ డార్విన్‌ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని  ప్రకటించిన రోజు 1859 నవంబర్‌ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవ ల్యూషన్‌ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకొంటున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మన దేశంలో కూడా జరపడం అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలహీనపడుతోంది.  జీవ పరిణామ సిద్ధాంతం (థియరీ ఆఫ్‌ ఎవొల్యూ షన్‌) పనికిరానిదని మాట్లాడే రోజులొచ్చాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతి శీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. 

‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ధ్యానిస్తూ కళ్ళు మూసు కోవడం కాదు, నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు అన్నది తెలుసుకుంటే, నీ కళ్ళు తెరు చుకుంటాయి. ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి? ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాంతా నికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునేవారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్‌ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు.

అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లోగానీ, పౌర సమాజాల్లోగానీ, కుటుంబాల్లోగానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తు న్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్స్‌ కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతులైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని దేశంలోకొనసాగుతున్న విషమ పరిస్థి తులను అర్థం చేసుకుని, ఎక్క డికక్కడ ఎవరికి వారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. వట్టి ఆలోచన లతో పని జరగదు. వాటిని ఆచ రణలో పెట్టాలి. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మరింతగాఉంది. విద్యార్థులకు జీవ పరి ణామంపై, డార్విన్‌పై సంద ర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావి భారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధ పెట్టాలి. వారిని హేతుబద్ధంగా ఆలోచింప జేయాలి. మానవ వాదులుగా తీర్చిదిద్దు కోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొ కరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి.

– డా. దేవరాజు మహారాజు
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, బయాలజీ ప్రొఫెసర్‌‘

Advertisement
 
Advertisement
Advertisement