
దేశంలో సంపన్నులకే పరిమితమైన విద్యను సామాన్యుల దరికి చేర్చిన ఘనత అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే దక్కింది. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ఏర్పాటైనప్పటి నుంచి విద్యకు దూరమైన వారిని అక్కున చేర్చుకుంది. మొత్తం విద్యార్థుల్లో సగటున 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. స్త్రీలు విద్యావంతులు కావడంలోనూ ఎంతో కృషి చేస్తోంది. మొత్తం మీద యూని
వర్సిటీ విద్యార్థుల్లో సగటున ఏటా 48 శాతం మంది మహిళలుఉంటున్నారు.
Dr B.R. Ambedkar Open University (BRAOU) యూనివర్సిటీ ఈ ఏడాది (2025–26) నుంచి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘చదువుతూ సంపాదించు’ విధానంపై దృష్టి సారించారు. విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ‘శ్రీ రామానందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్’తో ఒప్పందం కుదుర్చుకుంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఉచిత భోజన, వసతితో వివిధ అంశాల్లో రెండు నుంచి మూడు నెలలు ఈసంస్థలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్, ఆటోమొబైల్, సోలార్ విద్యుత్తు నుంచి అనేక రంగాలకు సంబంధించి వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అవసరమైన మెలకువలు, నైపుణ్యం సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అదే తరహాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)తోనూ యూనివర్సిటీ సంప్రతింపులు జరిపింది. నిర్మాణరంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుంది
చదవండి: Gorati Venkanna: పాటతల్లికి పెద్దకొడుకు
యూనివర్సిటీ మహిళా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ‘వీ హబ్’తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పనిచేసే సిబ్బంది నైపుణ్యాల్ని పెంపొందించేందుకు సర్టిఫికెట్, డిప్లమో ప్రోగ్రామ్స్ రూపొందించింది. మహిళా, శిశు సంక్షేమశాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2025– 26) నుంచి గిరిజన విద్యార్థులకు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్కు ఉచిత విద్య అందించనున్నది. సైనికులకూ, ఖైదీలకూ ఇప్పటికే విద్యను అందుబాటులోకి తెచ్చింది.
యూనివర్సిటీ మంగళవారం తన 26వ స్నాతకోత్సవం జరుపుకొంటోంది. రెండు విద్యాసంవత్సరాలకు (2023–24, 2024–25) సంబంధించిన 60,288 మందికి డిగ్రీలు అందిస్తోంది. 55 మందికి డాక్టరేట్ పట్టాలుఅందించనున్నారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయ నున్నారు. అందులో ఒకరు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న కాగా మరొకరు ప్రఖ్యాత శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్!
– డా.ఎల్వీకే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్
(నేడు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం)