
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటలా ఉంటున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరి వివాహేతర సంబంధాలు, సోషల్ మీడియా క్రేజ్ వంటి రకరకాల కారణాలతో వైవాహిక బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మరికొన్ని చోట్ల వరకట్నం దంపతుల పాలిట శాపంగా మారి బాంధవ్యాన్ని ముక్కలు చేస్తోంది. ఎన్నో వరకట్నం కేసుల్లో నగదు లేదా బంగారం వంటి అత్తింటి డిమాండ్లు గురించి విని ఉంటాం. కానీ ఇలాంటి డిమాండ్లతో కూడిన వరకట్నం కేసు మాత్రం ఇదే మొదటిది.
వివరాల్లోకెళ్తే..బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన దీప్తి అనే మహిళకు 2021లో అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లైన రెండు నెలల వరకు వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ.. బైక్, మరికొంత నగదు ఇవ్వాల్సిందే అంటూ దీప్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు అత్తింటివారు. అక్కడి వరకు బాగానే ఉంది.
ఇప్పుడూ మా అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడి కోసం కిడ్నీ కూడా దానం చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీప్తి భర్త పెళ్లికి ముందు నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నడు. కానీ దీప్తికి ఆ విషయం పెళ్లైన తర్వాతే తెలిసింది. మొదట్లో అత్తంటి వారి డిమాండ్లు ప్రతీఇంట్లో ఉండేవే కదా అని తేలిగ్గా తీసుకుంది. అది రాను రాను మితిమీరి..ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేంత వరకు దారితీశాయి.
ఆమె కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే కుటుంబంలో మరింత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో పోలీసులను సంప్రదించింది దీప్తి. ఆ నేపథ్యంలో అధికారులు ఇరువురి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా..అది కూడా విఫలమైంది. అదీగాక అత్తింటి వేధింపులతో విసిగిపోయిన దీప్తి భర్తతో కలిసి ఉండేందుకు నిరాకరించి, విడాకులు కావాలంటూ కోర్టుని ఆశ్రయించింది. అందుకు భర్త మాత్రం ససేమిరా అంటున్నాడు.
అలాగే పోలీసులు దీప్తి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతోపాటు మరో ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఎక్కడైనా వరకట్నం కేసులో..అధిక డబ్బు లేదా బంగారం కోసం డిమాండ్ చేయడం వంటివి ఉంటాయి ఏకంగా ఓ వ్యక్తి అవయవాన్ని సైతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన వింత కేసు ఇదేనని చెబుతున్నారు అధికారులు.
(చదవండి: చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..! తనిఖీల్లో షాకింగ్ విషయాలు..)