చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..! | Food Safety Task Force Raids On Several Hotels In Kamareddy Telangana, Know More Details Inside | Sakshi
Sakshi News home page

చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..! తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు..

Jun 12 2025 1:55 PM | Updated on Jun 12 2025 3:24 PM

Food Safety Task Force raids on several hotels in Kamareddy Telangana

ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్‌తో అప్పుడప్పుడు హోటల్‌కు వెళ్లి భోజనం చేయడం చాలా మందికి అలవాటు. హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటారు. కమ్మటి భోజనం తింటున్నామని అనుకుంటున్నారే తప్ప ఫుడ్‌ తయారీ విషయంలో హోటళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. తిన్నపుడు బాగుందనే భావనతో ఇంటికి చేరుకుంటారు. కాసేపటి తరువాత కడుపులో ఏదో అలజడి మొదలవుతుంది. గొంతులో మంట, కడుపులో పేగులు మెలేసినంతగా నొప్పి వస్తుంది. గ్యాస్‌ ప్రాబ్లమ్‌ అనుకుంటారే గానీ.. తిన్న ఫుడ్‌ గురించి పట్టించుకోరు. అయితే ఈనెల 10న కామారెడ్డిలోని పలు హోటళ్లపై ఫుడ్‌సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు నిర్వహించాయి. తనిఖీల్లో జీర్ణించుకోలేని వాస్తవాలు వెలుగు చూశాయి. పేరున్న హోటళ్లలోనూ కిచెన్‌లు అధ్వానంగా, కంపుకొడుతూ కనిపించాయి. ఈగల మోతతోపాటు కుళ్లిపోయిన మాంసం, రొయ్యలు, ఇతర ఆహార పదార్థాలను చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. నిత్యావసరాలు చాలా వరకు కాలం చెల్లినవి గుర్తించారు.

వాడిన నూనెలనే వాడుతూ...
హోటళ్లలో బ్రాండెడ్‌వి కాకుండా సాధారణ నూనెలు వాడుతున్నారు. దానికి తోడు ఫ్రై ఐటంలు నూనెలలో వేయించిన తరువాత నూనెను ఇతర ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో చాలా మంది పామాయిల్‌ వాడుతున్నారు. మరికొన్ని హోటళ్లలో లోకల్‌గా తయారయ్యే రిఫైన్డ్‌ అయిల్‌ను వినియోగిస్తున్నారు. కొనిచోట్ల మాత్రమే బ్రాండెడ్‌ ఆయిల్స్‌ వాడుతున్నారని తెలుస్తోంది.

నిల్వ ఉంచిన మాంసం..
హోటళ్లలో ఎక్కువ మంది మాంసాహారం తినడానికే ఇష్టపడతారు. ప్రధానంగా చికెన్‌, ప్రాన్స్‌, ఫిష్‌ ఐటంలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. హోటళ్ల నిర్వాహకులు చేపలు, రొయ్యలను ఇతర ప్రాంతాల నుంచి హోల్‌సెల్‌గా తెప్పించి ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతారు. రోజుల తరబడి నిల్వ ఉంచడం మూలంగా అవి పాడవుతాయి. వాటినే శుభ్రం చేసి ఉడికించి వండి వడ్డిస్తున్నారు. అలాగే చికెన్‌, మటన్‌ కూడా నిల్వ చేసి, వేడి చేసి వడ్డిస్తున్నారు.

అధ్వానంగా కిచెన్‌లు..
చాలా హోటళ్లలో కిచెన్‌ గదులు అధ్వానంగా ఉంటున్నాయి. కనీస పరిశుభ్రత పాటించడం లేదు. ఈగలు మోతమోగిస్తున్నా పట్టించుకోరు. కొన్ని హోటళ్లలో ఎలుకలు కూడా సంచరిస్తుంటాయి. తినడానికి కూర్చునే గదులు, హాళ్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయి.

రెగ్యులర్‌ తనిఖీలు లేకే...
సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు హోటళ్లు, స్వీట్‌ హోంలు, టిఫిన్‌ సెంటర్లను తనిఖీ చేయాల్సి ఉండగా.. నెలల తరబడి కూడా తనిఖీలు చేపట్టడం లేదు. అప్పుడప్పుడు మొక్కుబడిగా.. అదీ చిన్నచిన్న టిఫిన్‌ సెంటర్ల మీద దాడులు చేయడం తప్ప పెద్ద హోటళ్లలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించేదాకా ఇక్కడి హోటళ్లలో అధ్వాన పరిస్థితులు ఉన్నట్టు ఎవరూ గుర్తించలేదు. ఇప్పటికై నా అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేపట్టి, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement