
తెగిపోతున్న వివాహ బంధాలు
ఏడడుగులు నడిచిన కొన్నాళ్లకే..
ఠాణామెట్లు ఎక్కుతున్న యువ జంటలు
పచ్చని కాపురాల్లో చిచ్చు
పెరుగుతున్న గృహహింస దరఖాస్తులు
కోర్టుల్లో నడుస్తున్న విడాకుల కేసులు
నగరానికి చెందిన ఓ యువజంటకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగాల్సిన వీరి కాపురంలో పెళ్లయిన నెలరోజులకే చిచ్చు మొదలైంది. ఇంట్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు వీరి గొడవకు ప్రధాన కారణంగా మారాయి. గొడవ పెద్దదై ఈ యువజంట పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.
నగరానికి చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కొన్నాళ్లకు ఆధిపత్య పోరు మొదలైంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు జీవిస్తూ.. విడాకుల కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకని ఆరా తీసిన పోలీసులు, న్యాయవాదులు ఆ జంట చెప్పిన కారణంతో అవాక్కయ్యారు. దీనికి పూర్తి కారణం ఇరువురి తల్లిదండ్రుల అతిజోక్యమేనని కౌన్సెలింగ్లో పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరావిు..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన కొందరు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది.
– కరీంనగర్క్రైం
చిన్న చిన్న కారణాలతో..
⇒నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి.
⇒బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు.
⇒ ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి.
⇒నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి.
⇒ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి.
⇒పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.
అవగాహన అవసరం
⇒కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి.
⇒అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
⇒అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు.
⇒ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు.
⇒విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్ కౌన్సిలర్ పేర్కొన్నారు.
ఆధిపత్య ధోరణి వద్దు
దాంపత్య జీవితానికి విలువ తెలియక చాలా మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహం అనంతరం ఎలా వ్యవహరించాలి..? ఎలా ఉండాలనే విషయాలపై పెద్దలు అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే దాంపత్య జీవితంలో ఎలా ఉండాలనే విషయాలు తెలిపే ప్రి మారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి అని నా భావన.
– అట్ల శ్రీనివాస్రెడ్డి, సైకాలజిస్ట్
తొందరపాటుతోనే..
దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ తరం పిల్లలకు దాంపత్య బంధం విలువ సరిగా తెలియడం లేదు. పెళ్లయ్యాక ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటు పడి ఒకరి మాట ఒకరు వినడం లేదు. చిన్న గొడవకే ఠాణాకు వస్తున్నారు. అనుమానం, తల్లిదండ్రుల మితివీురిన జోక్యం, దురలవాట్లు, గృహహింస, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం మా వద్దకు వచ్చే దంపతుల మధ్య గొడవకు ప్రధాన కారణాలు. – శ్రీలత,
మహిళా పోలీస్స్టేషన్ సీఐ, కరీంనగర్