ఏఐ వాడకం పెరుగుతున్న కొద్ది డేటా సెంటర్ల అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఉన్న డేటా సెంటర్లు నగరాల్లోనే ఉన్నాయి. డేటా సెంటర్లలోని సర్వర్ల నిర్వహణ కోసం విపరీతంగా విద్యుత్తు, నీరు అవసరం ఉంటుంది. నగరాల్లో వీటిని నిర్వహించడం వల్ల విద్యుత్తుకు, నీటికి కొరత ఏర్పడటమే కాకుండా, పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని ఇప్పటికే పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమస్యలేవీ లేకుండా, నగరాలపై ఒత్తిడి లేకుండా డేటా సెంటర్లను సముద్రంలో ఏర్పాటు చేసేందుకు అమెరికన్ కంపెనీ ‘నాటిలస్ డేటా టెక్నాలజీస్’ సహా పలు బడా కంపెనీలు, కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. సముద్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సముద్ర తరంగాల ద్వారానే విద్యుత్తును పొందవచ్చని, సముద్ర జలాలను శుద్ధిచేసి డేటా సెంటర్ల నిర్వహణ కోసం వాడుకోవచ్చని భావిస్తున్నాయి.


