కైరో: సుమారు 4500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈజిప్ట్లోని గీజా మహా పిరమిడ్లు భారీ భూకంపాలను తట్టుకుని ఎలా నిలబడగలిగాయి? 1992లో సంభవించిన 5.8 తీవ్రత గల భూకంపం వల్ల వీటి వెలుపలి భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, వీటి ప్రధాన కేంద్రం (కోర్) మాత్రం చెక్కుచెదరలేదు. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఈజిప్ట్ భూభౌతిక శాస్త్రవేత్త ఆసిమ్ సలామా నేతృత్వంలోని బృందం ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురించిన తాజా అధ్యయనం, ఈ నిర్మాణాల వెనుక ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యాలను వెల్లడించింది.
సిస్మిక్ ఫ్రీక్వెన్సీ మిస్మ్యాచ్
పరిశోధకులు హారిజాంటల్-టు-వర్టికల్ స్పెక్ట్రల్ రేషియో అనాలసిస్ పద్ధతిని ఉపయోగించి పిరమిడ్ అంతర్గత, బాహ్య ప్రాంతాల్లోని 37 చోట్ల సూక్ష్మ వైబ్రేషన్లను నమోదు చేశారు. ఈ అధ్యయనంలో పిరమిడ్ సహజ పౌనఃపున్యం (Natural Frequency) 2.0 నుండి 2.6 హెర్ట్జ్ (Hz) మధ్య ఉండగా, దాని చుట్టూ ఉన్న నేల ఫ్రీక్వెన్సీ కేవలం 0.6 హెర్ట్జ్ మాత్రమే ఉన్నట్లు తేలింది. భూకంపం వచ్చినప్పుడు నేల యొక్క ఫ్రీక్వెన్సీ, కట్టడం ఫ్రీక్వెన్సీతో సరిపోలితే 'రెజోనెన్స్' (అనునాదం) ఏర్పడి కట్టడాలు కూలిపోతాయి. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల భూకంప శక్తి పిరమిడ్ లోపలికి బదిలీ కాలేకపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇంటర్నల్ షాక్ అబ్జార్బర్స్
ఈ పిరమిడ్లలోని అంతర్గత నిర్మాణాలు భూకంప ప్రకంపనల తీవ్రతను తగ్గించే యాక్టివ్ షాక్ అబ్జార్బర్లుగా పనిచేస్తున్నాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ముఖ్యంగా పిరమిడ్ లోపల ఉండే ‘కింగ్స్ ఛాంబర్’ (రాజు గది) పైభాగంలో అమర్చిన ప్రత్యేక గదులు వైబ్రేషన్లను భారీగా తగ్గిస్తున్నట్లు తేలింది. వీటితో పాటు, పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించిన దట్టమైన గ్రానైట్ శిలల్లో ఉండే క్వార్ట్జ్ స్ఫటికాలు భూకంప తరంగాలను శోషించుకోకుండా (absorb చేయకుండా) తిరిగి పరావర్తనం (reflect) చెందిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల ప్రత్యేకమైన ధ్వని ప్రభావాలు కూడా ఏర్పడుతున్నాయి.
అద్భుతమైన ఆకృతి.. శాస్త్రీయ నిర్మాణం
ఆధునిక భూకంప నిరోధక డిజైన్లు కేవలం ఫ్రీక్వెన్సీలపైనే కాకుండా నిర్మాణపు బరువు, లెక్సిబిలిటీ, సెంటర్ ఆఫ్ మాస్ (ద్రవ్యరాశి కేంద్రం) పై ఆధారపడతాయి. గీజా పిరమిడ్ వెడల్పైన బేస్ (పునాది), భూమికి దగ్గరగా ఉండే తక్కువ సెంటర్ ఆఫ్ మాస్, పైకి వెళ్లే కొద్దీ ఇరుకుగా మారే టేపరింగ్ ఆకృతి, ఖచ్చితమైన సమమితి (Symmetrical plan) దాని స్థిరత్వాన్ని పెంచాయి. నాటి పురాతన ఇంజనీర్లు అత్యంత సమర్థవంతమైన డిజైన్, ఇంజనీరింగ్ నైపుణ్యంతోనే వీటిని నిర్మించారని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?


