ఏలూరు (టూటౌన్): జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారుల వైఖరిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలను తొలగిస్తున్నా టీడీపీ నాయకులకు చెందిన షాపులను ఎందుకు వదిలేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నిత్యం రద్దీగా ఉండే జిల్లాపరిషత్ సెంటర్ నుంచి ఇండోర్ స్టేడియం, కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో జిల్లాపరిషత్ దుకాణ సముదాయాల వద్ద ఫుట్పాత్లు, డ్రెయిన్లు ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అలాగే డ్రెయిన్లలో సిల్ట్ తొలగింపు ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు శుక్రవారం జిల్లాపరిషత్ కూడలిలో ఉన్న పుట్పాత్, డ్రెయిన్ల ఆక్రమణలు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడా పచ్చపాతమే చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారి దుకాణాలు ముందు యథేచ్చగా యంత్రాలతో పగుల గొట్టిన సిబ్బంది, రాజకీయ పలుకుబడి మెండుగా ఉన్న ఓ టీడీపీ నాయకుడి షాపు ముందు పుట్ ఫాత్పై నిర్మించిన జ్యూస్ షాపు జోలికి మాత్రం వెళ్లక పోవడం గమనార్హం. దీంతో ఇదెక్కడి న్యాయం? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
రాజకీయ పైరవీలకు తావివ్వకూడదు
పట్టణంలో ఇటీవల కాలంలో ఆక్రమణలు భారీగా పెరిగాయి. అయితే ప్రజల ఫిర్యాదులతో ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారు. అయితే ఆక్రమణలు తొలగించే విషయంలో వీడు మనవాడా? కాదా అనే విషయాలతో పాటు రాజకీయ పైరవీలకు చోటివ్వకుండా ఎవ్వరైనా ఒక్కటే అన్న చందంగా ఆక్రమణలు తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. సాధారాణ వ్యక్తుల దుకాణాలకు సంబంధించిన ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది, రాజకీయ నాయకులు జోలికి వెళ్లకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ అండా లేని వారి, ప్రతిపక్షనాయకులకు చెందిన వాటిని ధ్వంసం చేసి తమ పార్టీకి చెందిన వారికి మాత్రం వెసులుబాటు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణలు తొలగింపులో అధికారుల వింత వైఖరి
డ్రెయిన్లపై కట్టిన టీస్టాల్, ఇతర నిర్మాణాల తొలగింపు
టీడీపీ నాయకుడి జ్యూస్ షాపు జోలికి వెళ్లని వైనం


