పెనుగొండ: ఆచంట మండలం కొడమంచిలిలో ఆరేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి షోడా షాపును పోలీసులు తొలగించారు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల పాపపై 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం అఘాయిత్యానికి పాల్పడిన సంగతి విధితమే. కాగా, నిందితుడు పరారీలో ఉండడంతో రోడ్డు ఆక్రమణలో ఉన్న అతడి దుకాణాన్ని పెనుగొండ సీఐ రాయుడు విజయ్కుమార్ ఆధ్వర్యంలో ఆచంట ఎస్సై కె.వెంకట రమణ జేసీబీతో కూల్చివేశారు. నిందితుడు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని వివరించారు. అయితే బాధితురాలికి అందించాల్సిన ప్రభుత్వ సహాయం వెంటనే అందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ముక్కు పచ్చలారని బాలికపై అఘాయిత్యానికి పాల్పడినా ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రకటనలు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలహీన వర్గానికి చెందిన కుటుంబం కావడంతో ఎవరి అండదండలు లేకపోవడంతో న్యాయం జరగడం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


