ఒకసారంటూ పొరపొచ్చాలు వచ్చాక ఎంత సన్నిహిత మిత్రుల మధ్యనైనా తిరిగి సాధారణ సంబంధాలు ఏర్పడటం అంత సులభం కాదు. ఫ్రాన్స్లో జరిగిన జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశం తీరుతెన్నులు గమనిస్తే ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. ట్రంప్ గత 16 నెలలుగా అనుసరిస్తున్న అమిత్ర వైఖరి ఇందుకు కారణం. మిత్ర దేశాలని లేదు, ప్రత్యర్థి దేశాలని లేదు – అందరినీ ఒకే గాటన కడుతూ, ఒక దేశాధినేతకు ఉండాల్సిన కనీస ఔచిత్యాన్ని మరిచి ఇష్టానుసారం మాట్లా డటం ఆయనకు అలవాటుగా మారింది.
అంతేకాదు – ఎడాపెడా అధిక సుంకాలు విధించటం, తమ సరుకుపై సుంకాలు తగ్గించాలని కోరడం వంటివి మన దేశాన్ని చీకాకు పరి చాయి. ఇలాంటì చేదు అనుభవాలు ఎన్ని ఎదురైనా మన దేశం సంయమనం పాటించింది. నిజానికి మొన్న భారత నావికులు ముగ్గుర్ని హార్మూజ్ జలసంధి వద్ద హత్య చేసిన ఉదంతంతోసహా ఈ 16 నెలల పొడవునా మన దేశం పరుషంగా మాట్లాడింది ఎప్పుడూ లేదు.
నోబెల్ శాంతి బహుమతి యావలో భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపాననీ, ఇద్ద రినీ తీవ్రంగా బెదిరించాననీ మాట్లాడినప్పుడు అందులో ఏమాత్రం నిజం లేదని మన దేశం చెప్పింది. ఆయన ఇలా డప్పుకొట్టుకుంటున్నప్పుడల్లా మొదట్లో ఖండిస్తూనేవచ్చింది. కానీ దీన్ని ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారని తేలాక మిన్నకుండి పోయింది. అయినా ట్రంప్లో ఆగ్రహావేశాలు తగ్గలేదని తాజా సమావేశం రుజువు చేసింది.
మాటలకేం... ట్రంప్ చాలా మాట్లాడారు. 55 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం ‘మోదీ మంచిగా కనబడతారు. బాగుంటారు. దేవదూత. కానీ ‘కిల్లర్’. వాణిజ్య, వ్యాపార చర్చల్లో చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉంటారు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఎవరైనా భారత్వైపు కన్నెత్తి చూస్తే వాళ్ల అంతు చూస్తామని కూడా చెప్పారు. వాణిజ్య ఒప్పందం విషయంలో చాలా దగ్గరగా వచ్చేశామని కూడా అన్నారు. కానీ చేతలు చూస్తే అందుకు అనుగుణంగా లేవు.
తన ఆధ్వర్యంలోని కమాండ్లలో ఒకటైన ఇండో–పసిఫిక్ కమాండ్కు ఆ పేరు పెట్టింది ఆయన ఏలుబడిలోని అమెరికాయే. తిరిగి ఆయనే ఎనిమిదేళ్లనాటి ఆ పేరులో భారత్నుసూచించే ‘ఇండో’ తొలగించి ఇప్పుడు యూఎస్–పసిఫిక్ కమాండ్గా మార్చటం, అది కూడా ఈ సమావేశానికి కొంచెం ముందుగా చేయటం యాదృచ్ఛికమేమీ కాదు. ఇటీవల యూఎస్–పసిఫిక్ కమాండ్లో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపటంలోనూ అమెరికా దురుద్దేశం స్పష్టమే. పాకిస్తాన్ పాలకులతో ట్రంప్కి ఏర్పడిన కొత్త చుట్టరికం అందరికీ తెలుసు.
తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో చైనా దూకుడునూ, ఆధిపత్య ధోరణుల్నీ ఎదుర్కొనటానికి ఆ దేశంతో సమస్యలున్న భారత్ను కలుపుకోవాలని నిర్ణయించి 2007లో క్వాడ్కు అంకురార్పణ చేసింది అమెరికాయే. హిందూ మహా సముద్రప్రాంతంలో చైనా విస్తరణవాద వైఖరిని ఎదుర్కొనటానికి క్వాడ్, దాంతోపాటు ఇండో– పసిఫిక్ కమాండ్ తోడ్పడతాయని కూడా అప్పట్లో తెలిపింది. కానీ స్వప్రయోజనాలే తప్ప మరేమీ పట్టని అమెరికాను నమ్ముకుని ముందడుగు వేయొద్దని అనేకమంది నిపుణులు అప్పట్లోనే మన దేశాన్ని హెచ్చరించారు. ఇవాళ చైనాతో అంటకాగటానికి రెడీ అయి, ఆ కమాండ్ పేరే మార్చిన అమెరికా కీలక సమయాల్లో ఎలా ఉండగలదో సులభంగానే ఊహించుకోవచ్చు.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే అందరికన్నా ముందు ఆయనతో వాణిజ్య ఒప్పందంపై చర్చించింది మనమే అయినా... మన తర్వాత వచ్చిన దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మనం కూడా బ్రిటన్, యూరోపియన్ యూని యన్ (ఈయూ), కెనడాలతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోగలిగాం. వీటిపై
లాంఛనంగా సంతకాలు చేయటమే మిగిలివుంది. మనకి నచ్చని అంశాలున్నప్పుడూ, అన్యాయమైన షరతులు పెడుతున్నప్పుడూ వ్యతిరేకించటం, కొంత జాప్యం జరిగినా ఈ విషయంలో మన ప్రయోజనాల పరిరక్షణకే ప్రాముఖ్యతనివ్వటం సరైన వైఖరి. ఉత్త మాటలతో ఎవరినీ నమ్మించలేమని ట్రంప్ గ్రహించేలా చేయటం అవసరం.


