
పాకిస్తానీలు నెలాఖరుకల్లా వెళ్లిపోవాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో దేశంలోని పాకిస్తానీలను ఈ నెలాఖరుకల్లా తిరిగి వారి దేశానికి పంపించేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికిచ్చిన వీసాలను కేంద్రం రద్దు చేసిందని తెలిపారు. సాధారణ వీసాలపై వచ్చిన పాకిస్తానీలు ఆదివారం నాటికి, వైద్య వీసాలపై వచ్చిన వారు ఈ నెల 29 నాటికి దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ఈ నెల 30 తర్వాత అటారీ సరిహద్దు మూసివేస్తున్నందున పాకిస్తాన్ నుంచి వివిధ వీసాలపై వచ్చిన వారిని గుర్తించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
28 నుంచి వేసవి
విజ్ఞాన శిబిరం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన స్థానిక ఆల్కాట్తోట శాఖా గ్రంథాలయంలో ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకూ వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. గ్రంథాలయాధికారి కొత్తపల్లి రమ్యశ్రీ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ శిబిరంలో రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కథలు చెప్పడం, కథలు చదవడం, చిత్రలేఖనం, క్రాఫ్ట్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర అంశాల్లో పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో విధ్వంసకర పాలన
చాగల్లు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దాడులు, కేసులతో విధ్వంసకర పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు విమర్శించారు. చాగల్లులో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ నిలువునా ముంచారని అన్నారు. ప్రతిపక్ష నేతలు, సామాన్య ప్రజలపై దాడులు, కేసులు, అవినీతి, ఊరూరా బెల్ట్ షాపులు తప్ప అభివృద్ధి, సంక్షేమం శూన్యమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఈ అరాచక పాలనను అన్ని వర్గాలూ గమనిస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. రబీ ధాన్యాన్ని విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని, వారు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని వెంకట్రావు కోరారు.

పాకిస్తానీలు నెలాఖరుకల్లా వెళ్లిపోవాలి