రమేశ్‌ మద్యం సేవిస్తుండగా వీడియో తీసిన శివాని! | Visakhapatnam Constable Ramesh Case Police Suspects Wife Shivani | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ మృతి కేసులో ట్విస్ట్‌.. భర్త తాగుతుండగా వీడియో తీసిన శివాని!

Aug 3 2023 9:03 PM | Updated on Aug 3 2023 9:21 PM

Visakhapatnam Constable Ramesh Case Police Suspects Wife Shivani - Sakshi

తాగిన తర్వాతే భర్త రమేశ్‌కు హార్ట్‌ఎటాక్‌ వచ్చిందంటూ శివాని..  

క్రైమ్‌: విశాఖపట్నం వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌ మృతి కేసులో ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. గుండెపోటుతో తన భర్త చనిపోయాడని భార్య శివాని(జ్యోతి) చెబుతుండగా.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో భర్తను చంపించి ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయిన తర్వాతే కేసు వివరాలు వెల్లడిస్తామని ఎంవీపీ సీఐ మల్లేశ్వర రావు సాక్షితో తెలిపారు. 

2009 లో కానిస్టేబుల్ గా విధుల్లోకి చేరాడు బర్రి రమేష్. 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వన్‌టౌన్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. మంగళవారం రాత్రి కానిస్టేబుల్ రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే.. ఆరోజు రాత్రి ఇంట్లో భర్త మద్యం సేవిస్తుండగా శివాని వీడియో తీసింది. తాగిన తర్వాత హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కానీ, శివాని తీరుపై అనుమానం రావడంతో రమేశ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపే.. 

గుట్టుచప్పుడు గా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది శివాని. ఎంవీపీ పోలీసుల ఎంట్రీతో.. వివాహేతర సంబంధ బాగోతం బయటపడింది!. ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో సంబంధం నడుపుతున్న ఆమె.. ప్రియుడు,అతని స్నేహితుడు సాయంతో భర్తను అంతమొందించింది. దిండుతో రమేశ్‌కు ఊపిరి ఆడకుండా చేసి చంపించి.. గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేసింది. 

ఏ ఒక్కరినీ వదలం
కానిస్టేబుల్‌ రమేశ్‌ అనుమానాస్పద మృతి కేసులో.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు సాక్షితో చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాక మాకు కొన్ని నిజాలు తెలిశాయి. రమేశ్‌ భార్య శివాని మొబైల్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టాం. కొంతమంది అనుమానితులను విచారిస్తున్నాం. రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీటివి ఫుటేజ్ సేకరించాం. శివాని ఇతర పరిచయాలపై ఆరా తీస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ మృతికి కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రమేష్ డ్యూటీలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతని సహచరులు అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్తున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిజాలు వెల్లడిస్తాం అని సాక్షితో అన్నారాయన. 
 

Advertisement
 
Advertisement
Advertisement