భర్తను నేల కింద పాతిపెట్టి.. రెండేళ్ల పాటు డ్రామా! | Jamnagar Woman Buries Husband Body Below Factory Floor | Sakshi
Sakshi News home page

భర్తను నేల కింద పాతిపెట్టి.. రెండేళ్ల పాటు డ్రామా!

Jul 30 2026 8:35 AM | Updated on Jul 30 2026 9:45 AM

Jamnagar Woman Buries Husband Body Below Factory Floor

జామ్‌నగర్: సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను తలపించే ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యానికి సంబంధించి పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి తెచ్చారు. భర్తను హత్య చేసి, రెండేళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఓ పారిశ్రామిక యూనిట్ నేలలో మృతదేహాన్ని పాతిపెట్టిన భార్య, ఆమె ప్రియుడి ఉదంతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిగ్నేష్ మావడియా అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చారు. కానీ, అతన్ని హత్య చేసి.. దారెద్ జీఐడీసీ  ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో దాదాపు 12 అడుగుల లోతున పూడ్చిపెట్టినట్లు పోలీసులు తేల్చారు.

కుటుంబ సభ్యులలో ఒకరు ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతూ.. అక్కడ జిగ్నేష్‌కు సంబంధించి స్థానిక కాంటాక్ట్ వివరాలు అడగడంతో ఈ హత్య సంగతి బయటపడింది. జిగ్నేష్ భార్య పృథ్వి, ఆమె ప్రియుడు నిలేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలం నుంచి వెలికితీసిన అస్థిపంజర అవశేషాలను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. అస్థిపంజరం ఎవరిదనే నిర్ధారణ అయిన తర్వాత హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

విచారణ వివరాల ప్రకారం.. పృథ్వి, నిలేశ్‌లకు ఆమె వివాహానికి ముందే సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా వారు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. జిగ్నేష్‌ను మద్యంలో సైనేడ్ కలిపి హత్య చేశారని.. అనంతరం అతని మృతదేహాన్ని దారెద్ జీఐడీసీలోని ఒక ఫ్యాక్టరీకి తరలించి, సుమారు 12 అడుగుల లోతు గుంట తవ్వి నేల కింద పాతిపెట్టారు. జిగ్నేష్ ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు పృథ్వి కుటుంబ సభ్యులకు నమ్మబలికిందని.. దీంతో దాదాపు రెండేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు.

జిగ్నేష్ సోదరుడు అశోక్ మావడియా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ జిగ్నేష్ ఆచూకీ ఏమాత్రం లభించకపోవడంతో సిటీ బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పృథ్వి తన నేరాన్ని అంగీకరించిందని.. మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో ఆ ప్రాంతాన్ని తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిభ నేతృత్వంలో సిటీ బి పోలీసులు దారెద్ జీఐడీసీలోని ఫ్యాక్టరీ ప్రాంగణంలో తవ్వకాలు జరిపి.. జిగ్నేష్‌దిగా భావిస్తున్న అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు. ఈ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించగా.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement