Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం.. సడన్‌గా కారు డోరు తీయడంతో

Teacher Died After Car Door Suddenly Opens At Road Bachupally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు పక్కన నిలిపిన క్యాబ్‌ డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చినన ప్రభుత్వ టీచర్‌కు తీవ్ర గాయాలై మృతి చెందగా, అతని కుమారుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల టీచర్‌ పెంటయ్య(45) ఆదివారం కొంపల్లిలో చదువుతున్న కుమారుడు శ్రీతేజను తీసుకుని ప్రగతినగర్‌కు వచ్చాడు. ఆపై అక్కడ నుండి జేఎన్‌టీయు మీదుగా కొండాపూర్‌కు బయలుదేరారు.

ఈ క్రమంలో ప్రగతినగర్‌ కాకతీయ హిల్స్‌ సమీపంలో రోడ్డుపై నిలిపిన క్యాబ్‌ డ్రైవర్‌ అకస్మాత్తుగా డోర్‌ను తెరిచాడు. దీంతో బైకుపై నుంచి పెంటయ్య, శ్రీతేజలు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన టిప్పర్‌ పెంటయ్య మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెంటయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

కాగా తీవ్రంగా గాయపడిన శ్రీతేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా క్యాబ్‌ డోరు తెరిచిన డ్రైవర్‌తో పాటు క్యాబ్‌ బుక్‌ చేసిన వ్యక్తిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top