
మొదటి భార్య ఉండగానే రెండో మనువు
పోలీసులకు రెండో భార్య ఫిర్యాదు
మైసూరు: వివాహమై భార్యతో కాపురం చేస్తున్నా మరొక మహిళతో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేయడమే కాకుండా రూ.9 లక్షలను తీసుకుని మోసగించిన ఘటన మైసూరులోని వీవీ మొహల్లాలో వెలుగుచూసింది. మోసపోయిన మహిళ జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో బెంగళూరు నివాసి భరత్గౌడ, అతని తల్లిదండ్రులు సురే‹Ù, అంకితలపై ఫిర్యాదు చేసింది.
వయసులో పెద్దయినా..
వివరాలు..బాధితురాలు భాగ్యలక్ష్మి (32) గోకులంలో ప్రైవేటు హాస్టల్ (పీజీ) నడుపుతున్నారు. 2022లో భరత్గౌడ (29)తో ఇన్స్టా లో పరిచయం ఏర్పడింది. తనకన్నా ఆమె పెద్దదైనప్పటికీ, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అప్పటికే అతనికి పెళ్లయింది. కానీ విడాకులు ఇచ్చానని బాధితురాలికి నమ్మబలికాడు. మోసగానికి అతని తల్లిదండ్రులు కూడా వంతపాడుతూ బాధిత మహిళను వలలోకి లాగారు. నమ్మిన మహిళ పెళ్లికి ఒప్పుకుంది. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల సమక్షంలో 2023లో ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో వ్యాపారం కోసమంటూ రూ.10 లక్షలు, 100 గ్రాముల బంగారు ఆభరణాలను భరత్గౌడ వరకట్నంగా తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.8 లక్షలు ఇచ్చి కార్ వాషింగ్ సెంటర్ని పెట్టించింది. అంతేగాకుండా ఆమె క్రెడిట్ కార్డు నుంచి భరత్గౌడ రూ.1.25 లక్షలను డ్రా చేసుకున్నాడు.
మొదటి భార్యకు తెలిసి
ఇలా ఉండగా మొదటి భార్య మోనిక ఈ విషయాన్ని తెలుసుకుని భాగ్యలక్ష్మికి భరత్గౌడ మోసగాడు, జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ చేసింది. దీనిపై భాగ్యలక్ష్మి నిలదీయగా, ఆమె మాటలు నమ్మవద్దని చెప్పాడు. మొదటి భార్యతో కాపురం చేస్తూనే నాటకమాడి తనను మోసగించినట్లు అర్థమైంది. దీంతో నిలదీయగా చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతని మోసాల గురించి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.