యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్‌.. ట్విస్ట్‌ ఏంటంటే..

Girl Kidnap Tragedy In Karimnagar - Sakshi

సాక్షి, ధర్మపురి(కరీంనగర్‌): యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి, కిడ్నాప్‌కు యత్నించిన ఘటన ధర్మపురిలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన ఓ యువతి(23)కి వెల్గటూర్‌ మండలంలోని కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో సోమవారం పెళ్లి నిశ్చయమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి.

ఇది చూసిన వెంటనే సారంగాపూర్‌ మండలంలోని రేచపెల్లికి చెందిన మంగళారపు రాజేందర్‌ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. లోపల ఉన్న ఆమెను లాక్కొచ్చి, కారులో ఎక్కించారు. జాతీయ రహదారి పక్కనున్న దుర్గమ్మ కాలనీ నుంచి కమలాపూర్‌ రూట్‌లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కారు ఆగిపోయింది.

బాధితురాలు రోదిస్తూ కేకలు వేయడంతో రాజేందర్‌ కోపోద్రిక్తుడై కత్తితో ఆమెను గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం జరగగా యువతి అరుపులు విన్న  చుట్టుపక్కల వాళ్లు, సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ నలుగురు పారిపోయారు. పోలీసులు కారును ఠాణాకు తరలించారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషను చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి,  గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ కోటేశ్వర్‌ తెలిపారు.

ఇద్దరూ డిగ్రీ క్లాస్‌మేట్స్‌..
రాజేందర్, బాధిత యువతి డిగ్రీ క్లాస్‌మేట్స్‌. ఈ క్రమంలో రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుంటానని రాజేందర్‌ ఆమె తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు నిరాకరించారని సమాచారం. రెండు రోజుల కిందట కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో యువతికి పెళ్లి నిశ్చయించారు. ఇది తెలుసుకున్న రాజేందర్‌ తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి, విఫలమయ్యాడు. 

చదవండి: పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top