Ghaziabad Man Shot Buried 7 Feet Deep By Wife Her Lover Body Found 4 Years Later - Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను చంపి.. అదే ఇంట్లో గోతి తీసి.. నాలుగేళ్ల తర్వాత

Nov 14 2022 6:43 PM | Updated on Nov 14 2022 7:29 PM

Ghaziabad Man Shot Buried 7 Feet Deep By Wife Her Lover Body Found 4 Years Later - Sakshi

లక్నో: నాలుగేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ పోలీసులు తాజాగా చేధించారు. ఈ కేసులో మృతుడి భార్య, పొరుగింటిలో నివాసముండే అరుణ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ తన ప్రియుడు అరుణ్‌తో కలిసి భర్తను కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 

హత్య చేసిన అనంతరం ప్రియుడు ఇంట్లోనే ఆరు అడుగుల గోతి తీసి అందులో మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు తేలింది. గొయ్యిపై నుంచి సిమెంట్‌ ఫ్లోరింగ్‌ చేసిన తరువాత అరుణ్‌ అదే ఇంట్లో ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడి ఇంట్లో నుంచి కుళ్లిపోయిన మృతదేహాన్ని, అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య చేసేందుకు ఉపయోగించిన పిస్టల్‌, గొడ్డలిని కనుగొన్నారు. భర్తను చంపకముందే గొయ్యి తీసి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహం దుర్వాసన రాకుండా లోతుగా తవ్వినట్లు తెలిపారు. 
చదవండి: Girlfriend Murder In Delhi: యువతితో సహజీవనం, హత్య, ముక్కలుగా నరికి.. ఢిల్లీ అంతటా 18 రోజుల్లో..

అసలేం జరిగిందంటే
తన భర్త చంద్రవీర్‌ సింగ్‌ కనిపించకుండాపోయాడని సవిత అనే మహిళ 2018లో ఘజియాబాద్‌లోని సిహానీ గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకున్నారు. భర్త అదృశ్యం వెనక అతని తమ్ముడి హస్తం ఉన్నట్లు భార్య తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో సరైన సాక్క్క్ష్యాధారాలు లేకపోవడంతో  మూసివేశారు.

నాలుగు సంవత్సరాల తరువాత ఇటీవల ఈ కేసులోఘజియాబాద్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు కొన్ని ఆధారాలు లభ్యమవ్వడంతో మళ్లీ విచారణ ప్రారంభించినట్లు ఎస్పీ దిక్ష శర్మ తెలిపారు. ఈ క్రమంలోనే  మృతుడి భార్య సవిత, ప్రియుడు అరుణ్‌ అలియాస్‌ అనిల్‌ కుమార్‌ కలిసి చంద్రవీర్‌ను హత్య చేసినట్లు వెల్లడైంది. ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు. 2017 నుంచి తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో తరుచూ గొడవలు జరిగేవని భార్య సవిత తెలిపింది. మరోసారి ఇలా జరగవద్దని పలుమార్లు హెచ్చరించాడని పేర్కొంది.

దీంతో చంద్రవీర్‌ తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్య చేసేందుకు సవిత, అరుణ్‌ పథకం వేశారు. సెప్టెంబర్ 28, 2018న చంద్రవీర్ అర్థరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. వెంటనే సవిత అరుణ్‌ను ఇంట్లోకి పిలిపించడంతో.. చంద్రవీర్ గదిలోకి వెళ్లి అతని తలపై కాల్చి చంపాడు. అనంతరం అతని మృతదేహాన్ని ఎత్తుకుని అతని ఇంటికి తీసుకెళ్లాడు. అరుణ్ ఇంటి వద్ద సవిత సాయంతో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులో చంద్రవీర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇక ఈ కేసులో నిందితులైన సవిత, అరుణ్‌ను కోర్టులో హజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement