కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని.. | Father attacks son with knife | Sakshi
Sakshi News home page

కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని..

Dec 10 2024 10:34 AM | Updated on Dec 10 2024 10:34 AM

Father attacks son with knife

కుమారుడిపై కత్తితో తండ్రి దాడి.. 

కాపాడిన స్థానికులు 

వికారాబాద్‌ జిల్లా తాండూరు

మండలం మల్కాపూర్‌లో ఘటన

తాండూరు రూరల్‌: అలిగి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే హత్య చేసేందుకు యత్నంచాడు ఓ తండ్రి. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్‌ గ్రామానికి చెందిన హన్మంత్‌కు తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన శరణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు అరవింద్, ధర్మ, కార్తీక్‌ ఉన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మల్కాపూర్‌లో నివాసముంటున్నారు. నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న హన్మంత్‌ రెండేళ్ల నుంచి శరణమ్మను వేధిస్తున్నాడు. 

దీంతో ఆమె రెండు నెలల క్రితం ఇద్దరు కొడుకులు ధర్మ, కార్తీక్‌లను తీసుకొని కర్ణాటక రాష్ట్రం బీదర్‌ సమీపంలోని బాల్కి గ్రామంలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. పెద్ద కుమారుడు అరవింద్‌ తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్‌లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. భార్య వచ్చిన విషయం తెలుసుకున్న హన్మంత్‌ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు ముగిశాక శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. 

ఎలాగైనా భార్యను ఇంటికి రప్పించాలని, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అరవింద్‌ను హత్య చేస్తే భార్య వస్తుందని హన్మంత్‌ కుట్ర పన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లి కత్తితో కుమారుడి మెడ, చేతులపై దాడి చేశాడు. గాయాలు భరించలేక బాలుడు గట్టిగా అరవడంతో ఇంటి పక్కనే ఉన్న అశోక్‌తోపాటు మరికొందరు వచ్చి తలుపులు పగలగొట్టి అరవింద్‌ను కాపాడారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి బాలుడిని తాండూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం అరవింద్‌ ఆరోగ్యం బాగున్నట్లు తెలిపారు. హన్మంత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement