Sakshi News home page

ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు!

Published Fri, Jun 16 2023 3:48 AM

Drugs are once again in the tollywood industry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి అలియాస్‌ కేపీ చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాముల కొకైన్‌ను సరఫరా చేస్తూ సైబరాబాద్‌ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నిందితుడు కేపీ చౌదరి నుంచి స్వాదీనం చేసుకున్న నాలుగు సెల్‌ఫోన్లలోని డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలతో ఫొటోలు, పార్టీ వీడియోలను పోలీసులు గుర్తించారు. గోవాతో పాటు హైదరాబాద్‌లో కిస్మత్‌పూర్‌లోని విల్లాలో కూడా ప్రైవేట్‌ పార్టీలు నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆయా ప్రముఖులు, సెలబ్రిటీల జాబితాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. 

ఎలా దొరికాడంటే..: గత నెల 5న మాదాపూర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం, రాయదుర్గం పోలీసు లు నానక్‌రాంగూడ సమీపంలో 300 గ్రాముల కొకైన్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితు డు రాకేష్‌ రోషన్‌ వాట్సాప్‌ ద్వారా కేపీ చౌదరి లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కదలికలపై నిఘా పెట్టిన సైబరాబాద్‌ పోలీసులు.. బుధవారం కిస్మత్‌పూర్‌ క్రాస్‌ రోడ్‌లో కొకైన్‌ను సరఫరా చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

900 మందికిపైగా కస్టమర్లు: రాకేష్, కేపీ చౌదరిల నుంచి స్వాధీనం చేసుకున్న 9 సెల్‌ఫోన్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. వీటిల్లో 900 మందికి పైగా కస్టమర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక డైరెక్టర్, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులతో వాట్సాప్‌ చాటింగ్‌లు, పలు లావాదేవీలు సైతం జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరికి డ్రగ్స్‌ సరఫరా చేసిన నైజీరియాకు చెందిన గ్యాబ్రియల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement