
హైదరాబాద్: ‘ఆడపిల్ల.. ఆడపిల్ల అని బాధపడకండని మా అమ్మానాన్నలకు చెప్పు. మరో జన్మంటూ ఉంటే వారి కడుపున మగపిల్లాడినై పుడతాను’ అని ఓ యువతి తన స్నేహితురాలికి ఫోన్లో మెసేజ్ పెట్టి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన జవహర్నగర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ అనిల్కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ కారి్మకనగర్కు చెందిన మనోహర్, లావణ్య దంపతులు. కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు చిత్ర శివాని (18) ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
శుక్రవారం ఉదయం ఆమె కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో దమ్మాయిగూడలో బస్సు దిగింది. సాయినగర్ కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వెళ్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత స్నేహితురాలికి ఫోన్లో ‘ఆడపిల్ల.. ఆడపిల్ల అని బాధపడకండి అని మా తల్లిదండ్రులకు చెప్పు.. మరో జన్మంటూ ఉంటే మగపిల్లాడినై వారి కడుపులో పుడతా’నంటూ మెసేజ్ పెట్టింది. సదరు స్నేహితురాలు వెంటనే ఫోన్ చూసుకోలేదు. ఈ క్రమంలోనే చిత్ర శివాని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వారు ఘటన స్థలికి చేరుకున్నారు. చిత్ర శివాని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.