బాలికపై బీఆర్‌ఎస్‌ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే.. | BRS Leader Assaulted Girl In Nizamabad District | Sakshi
Sakshi News home page

బాలికపై బీఆర్‌ఎస్‌ నాయకుడి అత్యాచారం.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే..

Jun 22 2023 8:34 AM | Updated on Jun 22 2023 8:34 AM

BRS Leader Assaulted Girl In Nizamabad District - Sakshi

బోధన్‌టౌన్‌(బోధన్‌): నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కొత్తపల్లి రవీందర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శక్కర్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న మైనర్‌ బాలికకు తండ్రి లేకపోవడంతోపాటు తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. 

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రవీందర్‌ ఆ బాలికను వారి ఇంటి సమీపంలోని తన మేకల షెడ్డులోకి లాక్కెళ్లి కాళ్లు, చేతులు బంధించి నోట్లో గుడ్డలు కుక్కి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. కాగా, బాలిక ఈ విషయాన్ని మంగళవారం బంధువులతో తెలిపింది. వారు రవీందర్‌ సోదరుడైన బీఆర్‌ఎస్‌ బోధన్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. 

దీంతో రవీందర్‌తో పాటు రాధాకృష్ణ.. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాధితులను బెదిరించారు. అత్యాచారం విషయం బుధవారం బయటకు పొక్కడంతో పోలీసులు వెంటనే రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రవీందర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. నిందితుడి సోదరుడు రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.  

కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే షకీల్‌ 
బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలియటంతో ఎమ్మెల్యే షకీల్‌ దంపతులు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. నిందితుడు రవీందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని, అతని సోదరుడు రాధాకృష్ణను కూడా ఫ్లోర్‌లీడర్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి: నర్సింగ్‌ విద్యార్థి కావ్య ఆత్మహత్య.. కారణం ఏంటి?  

Advertisement
 
Advertisement
Advertisement