జమ్మికుంట కౌన్సిలర్‌ అరాచకం.. | Sakshi
Sakshi News home page

జమ్మికుంట కౌన్సిలర్‌ అరాచకం..

Published Wed, Feb 21 2024 4:51 AM

Attack on three people who prevented land grab - Sakshi

జమ్మికుంట: ప్రభుత్వ భూమి కబ్జా చేసి బోరు వేయడమే కాకుండా.. ఆక్రమణ సరికాదని అడ్డుచెప్పిన ముగ్గురు గ్రామస్తులపై కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ కౌన్సిలర్‌ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రామన్నపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడోవార్డులోని రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల, వాటర్‌ ట్యాంక్‌ సమీప సర్వే నంబర్‌ 422లో కౌన్సిలర్‌ మేడిపల్లి రవీందర్‌ ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు.

అక్రమంగా బోరు వేసేందుకు యత్నిస్తుండగా , గ్రామస్తులు మర్రి మల్లయ్య, కోలకాని రాజు, మేడిపల్లి రమేశ్‌ అడ్డుకున్నారు. ఆగ్రహించిన కౌన్సిలర్‌ రవీందర్‌.. బుధవారం ఇనుప రాడ్‌తో ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దాడిలో మల్లయ్య, రాజుకు తీవ్రగాయాలు కాగా రమేశ్‌కు గాయాలయ్యాయి.

మల్లయ్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి.రవి తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement