వికారాబాద్: ‘నాతో ఉంటావా.. లేదా చస్తావా’ అని ఓ వ్యక్తి మహిళ గొంతు కోశాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం తిమ్మాయిపల్లికి చెందిన వివాహిత రేణుకకు.. తాండూరు పట్టణానికి చెందిన వడ్డె రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగగా.. ఆమె సదరు వ్యక్తికి దూరంగా ఉంటోంది.
తాజాగా ఆదివారం ఎదురు పడిన వివాహితను ఆపి, తనతోనే ఉండాలంటూ బెదిరింపులకు దిగగా.. ఆమె ఎదురుతిరిగింది. దీంతో రాజు బ్లేడుతో రేణుక గొంతు కోశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందుతున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు రాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


