చిత్తూరు కార్పొరేషన్: జిల్లాకు నూతనంగా మంజూరైన 12 సబ్స్టేషన్ల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్మాణ, ఎంఆర్టీ విభాగ అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చిత్తూరు నగరంలో 1, కుప్పంలో 3, మిగిలిన 4 నియోజకవర్గాలకు 2 చొప్పున సబ్స్టేషన్లు మంజూరు చేశామని వివరించారు.ఒకొక్క సబ్స్టేషన్ను రూ.2 కోట్ల వ్యయంతో 5 ఎంవీ సామర్థ్యంతో పీటీఆర్లు పెట్టనున్నామని చెప్పారు. అదే విధంగా జిల్లాలో డిసెంబర్లోపు ఆర్డీఎస్ఎస్ పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 420 ఫీడర్లు ఉండగా ఇప్పటి వరకు 300 పైగా ఫీడర్ల పనులు పూర్తయినట్లు వివరించారు. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై గ్రామీణుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయిని, వారికి అవగాహన కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని సూచించారు. అలాగే ఎల్నినో ప్రభావంతో విద్యుత్ వాడకం పెరిగిందన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు పెరుగుతునానయని, ఎస్పీఎంలలో ట్రాన్స్ఫార్మర్లను నిల్వ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈలు భాస్కర్నాయుడు, బాబు పాల్గొన్నారు.


