అడ్డగోలు దుష్ప్రచారమా బాబు?
పాలసముద్రం : సీఎం చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వివిధ రాష్ట్రాల్లో నిబంధనలను ఉల్లంఘించి పాలు, పెరుగు తయారు చేసిందన్నారు. పాల ఉత్పత్తులు నిల్వ కాలం పెంచడానికి ప్రమాదకర రసాయనాలు ఉండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. హెరిటేజ్ పెరుగులో కొవ్వు లేదని చెప్పి ఫుడ్ స్టేప్టీ, స్టాండర్స్ అధికారులు లక్ష ఫెనాల్టీ విధించే వరకు కనుగొనలేని చంద్రబాబు తిరుమల వెంకటన్న ప్రసాదం లడ్డూపై విషం చిమ్మడం సిగ్గుచేటన్నారు. తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలవనే లేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపిన సిట్ నిగ్గు తేల్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు శ్రీశైలం మల్లన్న లడ్డూలో కల్తీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. కనీసం విచారణ జరపకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమంత్రి అనిత దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.


