చిత్తూరులో సైక్లోథాన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సక్షమ్–2026 కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు నగరంలో సోమవారం సైక్లోథాన్ నిర్వహించారు. కోంగారెడ్డిపల్లిలోని పెట్రోల్ బంక్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ఈ సైక్లోథాన్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా హెచ్పీసీఎల్ చిత్తూరు సేల్స్ ఆఫీసర్ ఉదయ్ కార్తికేయన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. రోజువారీ జీవితంలో ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ శక్తి వనరుల వైపు ప్రజలు దృష్టి సారించాలని సూచించారు. ఈ సైక్లోథాన్లో సుమారు 100 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి పండ్లు పంపిణీ చేశారు.
సాహితీ పురస్కారాల
పోటీలకు ఆహ్వానం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాల ట్రస్టు ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాల పోటీలను నిర్వహిస్తున్నట్లు ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు రోజా, నిరంజన్రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కవులు, రచయితల నుంచి నాలుగు రకాల సాహితీ ప్రక్రియలకు సంబంధించిన రచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కథలు (కథానికలు), నవలలు, ఛందోబద్ధ కవిత్వం, వచన కవిత్వం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల తెలుగు రచయితల నుంచి జాతీయ స్థాయి నవలల పోటీలకు కూడా రచనలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రచయితలు జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్యకాలంలో ముద్రితమైన పుస్తకాలను మాత్రమే పంపాల్సి ఉంటుందన్నారు. జాతీయ స్థాయి నవలల పోటీలకు కూడా ఇదే కాలవ్యవధిలో ముద్రితమైన నవలలు అర్హమని స్పష్టం చేశారు. ప్రతి ప్రక్రియకు మూడు ప్రతులు (మూడు పుస్తకాలు) తప్పనిసరిగా పంపాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో ఉత్తమ రచనగా ఎంపికై న ప్రతి ప్రక్రియకు రూ.10 వేలు నగదు బహుమతి, జ్ఞాపిక, చందనమాల, శాలువతో ఘనంగా సన్మానిస్తామన్నారు. అలాగే ఉత్తమ జాతీయ స్థాయి నవలలుగా ఎంపికై న నాలుగు నవలలకు కూడా ఒక్కొక్క రచయితకు రూ.10 వేలు నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, చందనమాల, శాలువతో సన్మానం చేస్తామన్నారు. రచయితలు తమ రచనల మూడు ప్రతులను మార్చి 10వ తేదీ లోపల డాక్టర్ కె.రామలక్ష్మి రామలక్ష్మి నర్సింగ్ హోమ్, నెం.17–434, సుందరయ్య వీధి, చిత్తూరు – 517001 చిరునామాకు పంపాలని కోరారు. సాహితీ మహోత్సవాల తేదీ, వేదిక తదితర వివరాలను తరువాత ప్రకటిస్తామని ట్రస్టు నిర్వాహకులు పేర్కొన్నారు.


