కట్టండి రూ.803 కోట్లు.. జొమాటోకు జీఎస్టీ దెబ్బ! | Zomato Gets rs 803 Crore GST Demand On Delivery Charges | Sakshi
Sakshi News home page

కట్టండి రూ.803 కోట్లు.. జొమాటోకు జీఎస్టీ దెబ్బ!

Dec 13 2024 10:12 AM | Updated on Dec 13 2024 11:20 AM

Zomato Gets rs 803 Crore GST Demand On Delivery Charges

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకు (Zomato) జీఎస్టీ (GST) విభాగం నుంచి గట్టి దెబ్బ తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా రూ.803.4 కోట్ల పన్ను చెల్లించాలని థానేలోని జీఎస్టీ విభాగం ఆదేశించింది. డెలివరీ ఛార్జీలపై వడ్డీ,పెనాల్టీతో జీఎస్టీని చెల్లించని కారణం చూపుతూ పన్ను నోటీసు వచ్చినట్లు జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

"కంపెనీకి 2019 అక్టోబర్ 29 నుండి 2022 మార్చి 31 కాలానికి సంబంధించి 2024 డిసెంబర్ 12న ఒక ఆర్డర్ అందింది. రూ.4,01,70,14,706 జీఎస్టీతోపాటు వడ్డీ, పెనాల్టీ మరో రూ. 4,01,70,14,706 చెల్లించాలని సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్, థానే కమిషనరేట్, మహారాష్ట్ర నుంచి ఆర్డరు జారీ అయింది" జొమాటో పేర్కొంది.

అయితే జీఎస్టీ నోటీసులపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు జొమాటో తెలిపింది. దీనిపై తమ న్యాయ, పన్ను సలహాదారులతో సంప్రదించామని, వారి అభిప్రాయాల మేరకు జీఎస్టీ నోటీసులకు వ్యతిరేకంగా సంబంధిత అధికారుల ముందు అప్పీల్ దాఖలు చేస్తామని జొమాటో వివరించింది.

సాధారణంగా కస్టమర్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసినప్పుడు జొమాటో బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. వాటిలో ఆహార పదార్థాల ధర ఒకటి కాగా మరొకటి ఫుడ్‌ డెలివరీ ఛార్జీ. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి కంపెనీ దీని నుంచి మినహాయింపు ఇస్తుంది. ఇక మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్‌ ఫీజుపై విధించే ఐదు శాతం జీఎస్టీ పన్ను. ఇందులో ఫుడ్‌ డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్‌ చెల్లించడం లేదనేది జీఎస్టీ విభాగం అభియోగం.

Advertisement
 
Advertisement
Advertisement