జీఎస్టీ.. ఒక మైలురాయి సంస్కరణ | GST Day 2026 celebrations held in Hyderabad on Wednesday | Sakshi
Sakshi News home page

జీఎస్టీ.. ఒక మైలురాయి సంస్కరణ

Jul 2 2026 4:37 AM | Updated on Jul 2 2026 4:37 AM

GST Day 2026 celebrations held in Hyderabad on Wednesday

పన్నుల విధానాన్ని సమూలంగా మార్చివేసింది

కొత్త చట్టపరమైన, కార్యాచరణ సవాళ్లకూ దారితీసింది

హైకోర్టు సీజే జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పరోక్ష పన్నుల విధానాన్ని జీఎస్టీ సమూలంగా మార్చివేసిందని, ఇది ఒక మైలురాయి సంస్కరణ అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ అభివచ్చించారు. భారత్‌లో అత్యంత ముఖ్యమైన పరోక్ష పన్ను సంస్కరణలలో ఒకటైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన జీఎస్టీ దినోత్సవం–2026 వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమాఖ్య స్ఫూర్తి ద్వారా జీఎస్టీ పరిచయం దేశ పరోక్ష పన్నుల పద్ధతిని సరళీకృతం చేసిందని అన్నారు. 

ఇది పన్ను పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని తెలిపారు. సాంకేతికత ఆధారిత నిబంధనల అమలు పన్ను పరిపాలనను ఆధునీకరించినప్పటికీ, డిజిటల్‌ నోటీసులు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్, అప్పీల్‌ కాలపరిమితులకు సంబంధించిన వివాదాలతో సహా కొత్త చట్టపరమైన, కార్యాచరణ సవాళ్లకు కూడా దారితీసిందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మారుతున్న జీఎస్టీ వ్యవస్థను సమర్థవంతంగా కొనసాగించేందుకు పన్ను చెల్లింపుదారులు, చట్టపరమైన నిపుణులు, పన్ను అధికారులు సన్నద్ధం కావాలని జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. 

హైదరాబాద్‌ జోన్‌ నుంచి జీఎస్టీ కలెక్షన్లు 2017–18లో రూ.10,700 కోట్లు నమోదయ్యాయని.. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.32,400 కోట్లకు చేరిందని సెంట్రల్‌ ట్యాక్స్, కస్టమ్స్‌ హైదరాబాద్‌ జోన్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. శంషాబాద్‌ వద్ద నిర్మిస్తున్న కస్టమ్స్‌ నూతన కార్యాలయం నిర్మాణం పూర్తయిందని, రెండు నెలల్లో కొత్త ఆఫీసులో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. జీఎస్టీ అధికారుల కోసం 13 అంతస్తుల్లో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

సభికులను నవ్వించిన బ్రహ్మనందం..: జీఎస్టీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నటుడు బ్రహ్మనందం తన ప్రసంగం ఆద్యంతం సభికులను నవ్వించారు. ‘జీఎస్టీ ఆఫీస్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. నేను సిన్సియర్‌గానే పన్ను కడుతున్నాను కదా. నాకు ఫోన్‌ రావడం ఏంటి అని ఆందోళన చెందా. ఈవెంట్‌ గురించి తెలిసి ఉపశమనం చెందాను. ఇలాంటి కార్యక్రమాలకు హాస్యనటులను కూడా పిలుస్తారా అని ఆశ్చర్యపోయా. నాకు జీఎస్టీ ఏం తెలుసు. సబ్జెక్ట్‌ తెలియక మాట్లాడుతుంటే వణుకు పుడుతుంది. ఈ స్టేజ్‌ మీద నిలుచుంటే మనిషి కొంచెమే కనిపిస్తారు. దీని వల్ల ఆ మనిషి ఎంత వణుకుతున్నాడో తెలియకుండా ఉంటుంది’అని నవ్వుతూ అన్నారు. ఎటువంటి ఆలస్యం, వైఫల్యం లేకుండా తాను పన్ను చెల్లిస్తున్నట్టు బ్రహ్మనందం తెలిపారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement