
పని ఒత్తిడి పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది. అలా అని ముందే ఉద్యోగం మానేస్తే ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయనే భయాలున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు సరైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుని, దాన్ని పాటిస్తే 40 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది తమ కెరియర్ పీక్కు చేరుకున్నప్పుడు 40 ఏళ్లలో పనిచేయడం మానేసి మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. బాస్లు ఉండరు.. సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీస్కు వెళ్లాలా అనే బెంగా ఉండదు.. వీకెండ్ కోసం ఎదురుచూడటం అవసరం లేదు. అయితే నిజంగా 40 సంవత్సరాల వయసులో ఉద్యోగం మానేసి జీవితాంతం సౌకర్యవంతంగా జీవించవచ్చా? అనే అనుమానం ఉందా. అయితే కింది విషయాలు తెలుసుకోవాల్సిందే.
40 ఏళ్లకే రిటైర్ కావడం సాధ్యమేనా?
కొంతమంది ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధ్యమే. కానీ చాలా సవాలుతో కూడుకున్నది. ముందే రిటైర్ అవ్వడాన్ని ప్రధానంగా.. మీరు ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నారు.. కాలక్రమేణా మీ పెట్టుబడులు ఎలా పెరుగుతాయి.. అనే అంశాలు కీలకంగా మారుతాయి. 20-25 ఏళ్ల వయసు ఉన్నవారు 40 ఏళ్లకు రిటైర్ కావాలనుకుంటే ఆదాయంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రస్తుత వార్షిక ఖర్చులకు 79 రెట్లు పొదుపు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
ఫిన్నోవేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నేహాల్ మోటా మాట్లాడుతూ.. ‘40ల్లో రిటైర్ అవ్వడం సాధ్యమే. కానీ అధిక ఆర్థిక క్రమశిక్షణ, పక్కా ప్రణాళిక ఉండాలి. ఎక్కువ సంపాదించడంపైనే కాకుండా, అధికంగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. మధ్యతరగతి వేతనం పొందుతున్న వారు కూడా తమ ఆదాయంలో 50 శాతానికి పైగా పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెడితే త్వరగానే రిటైర్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలి?
ఉదాహరణకు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న వ్యక్తిని తీసుకుందాం. నెలకు రూ.50,000 ఖర్చులు ఉన్నాయనుకుంటే 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల పదవీ విరమణలో మంచి కార్పస్ రావాలంటే నెలకు రూ.18,080 ఆదా చేయాల్సి ఉంటుంది. 20-25 ఏళ్ల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటే తాను నెలకు రూ.35000 వేతనంతో ఉద్యోగం సాధించినప్పటి నుంచి నెలవారీ ఆదాయంలో 60-70% లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేయాలి. అంటే దాదాపు నెలకు రూ.20,000 పొదుపు చేయాలి. ఉద్యోగం వచ్చి, పెళ్లి కావాడానికి ముందు పొదుపును మరింత పెంచాలి. ఈ మొత్తాన్ని 20-25 ఏళ్ల కాలానికి 10-12 శాతం వార్షిక రాబడి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. కాలక్రమేణా ఇది 40-45 ఏళ్ల వయసు నాటికి రూ.2–2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుంది.