విజేతలుండని యుద్ధం | Xi Jinping says there are no winners in tariff war | Sakshi
Sakshi News home page

సుంకాల యుద్ధంలో విజేతలుండరు: జిన్‌పింగ్‌

Apr 14 2025 1:36 PM | Updated on Apr 14 2025 2:56 PM

Xi Jinping says there are no winners in tariff war

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఇతర దేశాల సహకారం కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగ్నేయాసియాలో పర్యటనలో భాగంగా సోమవారం వియత్నాం వెళ్లిన ఆయన వాణిజ్య, సుంకాల యుద్ధంలో విజేతలుండరని వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే భారీగా ఎగుమతులు చేస్తున్న దేశాల సరసన ఉన్న చైనాకు ట్రంప్ సుంకాల ప్రభావం అధికంగా ఉంటుంది. తాజాగా ట్రంప్‌ ఫోన్లు, కంప్యూటర్లు వంటి కొన్ని వస్తువులను సుంకాల నుంచి మినహాయించినప్పటికీ, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాపై సుంకాలు తీవ్ర పరిణామాలను చూపుతాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్‌ చైనాపై 145% సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా కూడా వెనక్కి తగ్గకుండా యూఎస్‌పై 125 శాతం సుంకాలు ప్రకటించింది.

సూపర్‌ పవర్‌గా చైనా

ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియాలోని వియత్నాంలో షీ జిన్‌పింగ్‌ పర్యటన ఆసక్తికరంగా మారింది. వియత్నాంపై కూడా యూఎస్‌ అధిక సుంకాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ‘ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రపంచంపై అమలు చేస్తున్న విధానానికి విరుద్ధంగా బాధ్యతాయుతమైన సూపర్ పవర్‌గా చైనా అవతరిస్తుంది’ అని సింగపూర్‌కు చెందిన ఐఎస్‌ఈఏఎస్‌-యూసోఫ్ ఇషాక్ ఇన్‌స్టిట్యూట్‌ విజిటింగ్ ఫెలో గుయెన్ ఖాక్ గియాంగ్ అన్నారు.

వాణిజ్య విధానాలు కాపాడుకోవాలి..

ఎగుమతులపై అమెరికా వాణిజ్య విధానాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసుకోవడానికి చైనా ఇతర దేశాల సహకారాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. వియత్నాం, చైనా అధికారిక మీడియాలో సంయుక్తంగా ప్రచురితమైన సంపాదకీయంలో షీ జిన్‌పింగ్‌ ‘వాణిజ్య యుద్ధం లేదా సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు’ అని రాశారు. ఇరు దేశాలు బహుళ వాణిజ్య వ్యవస్థను, స్థిరమైన ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలుసులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు వియత్నాంలోనే జిన్‌పింగ్‌ ఉండనున్నారు.

ఇదీ చదవండి: మా దగ్గర ఉంది.. మీకు ఇస్తామండి..

ఎలా తప్పించుకోవాలి..

జిన్‌పింగ్‌ పర్యటనను టారిఫ్‌ల ప్రకటన కంటే ముందుగానే ప్లాన్ చేసినప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికా మధ్య సుంకాల పోరు కారణంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. జిన్‌పింగ్‌ వియత్నాం, మలేషియా, కంబోడియా పర్యటన ట్రంప్ నుంచి చైనా ఎలా తప్పించుకోగలుగుతుందనే అంశంపైనే సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013లో జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వియత్నాంలో కేవలం రెండుసార్లు మాత్రమే పర్యటించారు. 2023 డిసెంబర్లో చివరిసారిగా సందర్శించిన ఆయన వియత్నాంకు వెళ్లడం ఇది మూడోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement