జస్ట్‌ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్‌ మాల్యా | Vijay Mallya made serious allegation against Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

జస్ట్‌ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్‌ మాల్యా

Jun 6 2025 1:14 PM | Updated on Jun 6 2025 1:30 PM

Vijay Mallya made serious allegation against Pranab Mukherjee

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక అంశాలు పంచుకున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంకు సంబంధించి మాల్యా 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి ప్రస్తావించారు. 2008 వరకు కంపెనీ సమర్థంగా పనిచేసిందని చెప్పారు.

పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో విజయ్‌ మాల్యా మాట్లాడుతూ.. ‘2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఇది భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో ప్రతి రంగం దెబ్బతింది. డబ్బు సరఫరా నిలిచిపోయింది. రూపాయి విలువ దారుణంగా దెబ్బతింది. 2005లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అనతికాలంలోనే లగ్జరీ సేవలకు పేరు తెచ్చుకున్నప్పటికీ పరిస్థితులు క్షీణించడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. కార్యకలాపాలను పెంచే ప్రణాళికతో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించాం. సమస్యలు వివరించాం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌ విమానాల సంఖ్యను తగ్గించే ప్రణాళికలతో, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఈ ఆర్థిక పరిస్థితుల్లో పని చేయలేకపోతున్నానని చెప్పాను. బ్యాంకుల మద్దతు ఉంటుందని ముఖర్జీ చెప్పారు. కానీ అలా ఏం జరగలేదు’ అని అన్నారు.

గొప్పగా పని చేయలేదన్నారు..

‘కొంతకాలానికి పరిస్థితులు మరింత దిగజారడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను నిలిపివేసింది. కంపెనీ కష్టాల్లో పడింది. మళ్లీ రుణం కోసం బ్యాంకుల వద్దకు వెళితే కంపెనీ అంత గొప్పగా పని చేయలేదని అన్నారు’ అని చెప్పారు. 2016లో భారత్‌ను విడిచి పారిపోయిన మాల్యా అప్పటి నుంచి యూకేలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనను భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.

దొంగను కాదు..

మాల్యాను ‘చోర్(దొంగ)’ అని పిలవడంపై.. పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. ‘పారిపోయిన వ్యక్తి’ అనే అంశంపై కూడా మాట్లాడారు. తనను దొంగగా ప్రజలు భావించడాన్ని ఖండించారు. ‘మార్చి 2016 తర్వాత భారత్‌కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలవండి. నేను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన పర్యటన కోసం భారతదేశం నుంచి బయలుదేరాను. సరైన కారణాల వల్ల నేను తిరిగి రాలేదు. కాబట్టి మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే మీ ఇష్టం. కానీ ‘చోర్’ అనే ముద్ర వేస్తున్నారు. దొంగతనం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.

అప్పు పలుమార్లు రికవరీ

భారతీయ బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.6,200 కోట్లను పలుమార్లు రికవరీ చేశారని మాల్యా కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. తన నుంచి యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్- ప్రస్తుతం లిక్విడేషన్ దశలో ఉంది), ఇతర అనుబంధ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని పూర్తిగా లెక్కించాలని కోరారు.

భారత్‌కు తిరిగి వస్తారా..?

భారత్‌కు తిరిగి రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు విజయ్ మాల్యా సమాధానమిస్తూ..‘భారత్ లో నిష్పాక్షిక విచారణ, గౌరవప్రదమైన హామీ ఉంటే మీరు చెప్పిన దానిపై మరోసారి ఆలోచిస్తాను’ అని చెప్పారు. మాల్యాతో పాటు ఇతర వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం యూకే నుంచి భారత్‌ రప్పించే ప్రయత్నం చేస్తోంది. కానీ, భారత నిర్బంధ షరతులు ఈసీహెచ్ఆర్ (యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్)లోని ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నాయని, అందువల్ల వారిని వెనక్కి పంపలేమని అప్పీల్ హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ హ్యాట్రిక్‌ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్‌!

స్టేట్‌మెంట్‌ ఇవ్వాలి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా రుణదాతలకు రూ.11,101 కోట్లకు పైగా రుణానికి సంబంధించిన కేసులో విజయ్ మాల్యా ఈ ఏడాది ఏప్రిల్ 9న లండన్ హైకోర్టులో దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి బ్యాంకులు వసూలు చేసిన రుణాల రికవరీ వివరాలను కోరారు. వాస్తవానికి రూ.6,200 కోట్లు బకాయి ఉండగా, బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని మాల్యా తరఫు న్యాయవాది వాదించారు. రుణం పూర్తిగా క్లియర్ అయిందని, ఇంకా రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, రికవరీ మొత్తాన్ని వివరిస్తూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement