
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే ఎక్కువగా మరోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 5.5 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ తర్వాత మరోసారి తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) జూన్ 04న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు మూడో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈసారీ తిరిగి మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6 శాతం నుంచి తాజాగా 5.5 శాతానికి చేరింది.
రెపో రేటు అంటే..
రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దాంతో ప్రపంచ వృద్ధి, వాణిజ్య అంచనాలను సవరిస్తున్నారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం కేంద్ర బ్యాంకులకు సవాలుగా మారుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ద్రవ్యోల్బణ అంచనాలను 3.7 శాతానికి తగ్గిస్తున్నాం. గతంలో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసిన 4 శాతం కంటే ఇది తక్కువే. బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం. రూ.2.5లక్షల కోట్ల బ్యాంకు నిధులను విడుదల చేయనున్నాం. దీంతో బ్యాంకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్లవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి రూ.9.5లక్షల కోట్లు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చాం. విదేశీ మారక నిల్వలు 691.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరో 11 నెలల వరకు దిగుమతులకు ఇబ్బంది ఉండదు’ అన్నారు.
ఇదీ చదవండి: ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు
2026 ఆర్థిక సంవత్సరం వాస్తవ జీడీపీ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా వృద్ధి ఇలా..
క్యూ1-6.5 శాతం
క్యూ2-6.7 శాతం
క్యూ3-6.6 శాతం
క్యూ4-6.3 శాతం