అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు! | US Orders Restrictions on AI Access Sparks Global Tech Concerns | Sakshi
Sakshi News home page

అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు!

Jun 20 2026 6:37 PM | Updated on Jun 20 2026 7:28 PM

US Orders Restrictions on AI Access Sparks Global Tech Concerns

సాంకేతికాభివృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్‌ సభ్యుడు అభయ్‌ కరందికర్‌ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్‌ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్‌ను ఇతర దేశాల వారికి నిలిపివేసిన సందర్భంలో ఆయన ఈ సూచన చేశారు.

ఆంథ్రోపిక్‌ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు ఫ్యాబిల్‌ 5, మైథోస్‌ 5ను అమెరికాయేతర సంస్థలు, వ్యక్తులు పొందకుండా ట్రంప్‌ సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఫ్యాబిల్‌ను గత వారమే ఆంథ్రోపిక్‌ విడుదల చేయడం గమనార్హం. ‘‘స్థానిక ఏఐ సదుపాయాలు, హార్డ్‌వేర్‌ అభివృద్ధిలో భారత్‌ వెనుకబడి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర సెమీకండక్టర్‌ చిప్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌ల్లేవు.

అమెరికా ప్రభుత్వం సరికొత్త ఎగుమతి నియంత్రణల ఆదేశాల నేపథ్యంలో టెక్నాలజీ అభివృద్ధిలో భారత్‌ స్వావలంబన సాధించాలి’’అని కరందికర్‌ పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఏఐ అప్లికేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పౌర సేవల్లో ఏఐ అమలు దిశగా నీతి ఆయోగ్‌ కృషి సాగిస్తుందన్నారు. డిజిటల్‌ ప్రజా సదుపాయాల అభివృద్ధిలో భారత్‌ ముందున్నట్టు చెప్పారు. ఫౌండేషన్‌ ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం 12 స్టార్టప్‌లకు ప్రభుత్వం సాయమందించినట్టు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement