
ఆర్వీ ఇంజినీరింగ్, విరూపాక్ష ఆర్గానిక్స్ క్యాపిల్లరీ టెక్నాలజీస్కు సెబీ గ్రీన్ సిగ్నల్
సెబీకి ఏక్వస్ అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు
సెప్టెంబర్లో సందడే సందడిగా సాగిన ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. దిగ్గజాలు టాటా క్యాపిటల్, వియ్వర్క్ ఇండియా, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానుండగా.. మరో 4 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి 2 కంపెనీలు తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్ కంపెనీలు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, విరూపాక్ష ఆర్గానిక్స్ చేరాయి. మరోపక్క సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిస్టింగ్కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో గోప్యతా మార్గంలో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు అప్డేటెడ్గా ఏక్వస్ మరోసారి సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.
షేర్ల జారీ, ఆఫర్..
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇన్ఫ్రా కన్సల్టెన్సీ సేవల సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 202.5 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 67.5 లక్షల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 76 కోట్లను రుణాల చెల్లింపునకు, దేశీ అనుబంధ సంస్థ ఎస్ఆర్ఏ ఓఎస్ఎస్లో రూ. 21.9 కోట్లు, విదేశీ అనుబంధ సంస్థలైన ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్లో రూ. 34.8 కోట్లు, బ్రిటన్ సంస్థ ఆర్వీ అసోసియేట్స్లో రూ. 20.8 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, డెడికేటెడ్ ఫ్రైట్ రైల్ కారిడార్ మొదలైన ప్రాజెక్టులకు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ సేవలు అందించింది.
ఫార్మా రంగ కంపెనీ
ఫార్మాస్యూటికల్ రంగ హైదరాబాద్ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న నిధులలో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణపై వెచి్చంచనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.
ఆర్అండ్డీ ఆధారిత ఫార్మా కంపెనీ విరూపాక్ష ప్రధానంగా ఏఐపీలు, ఇంటరీ్మడియేట్స్ను తయారు చేస్తోంది. 2025 మార్చి31కల్లా 54 ప్రొడక్టుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 811 కోట్ల ఆదాయం, రూ. 78 కోట్ల నికర లాభం ఆర్జించింది. హైదరాబాద్లో నాలుగు, కర్ణాటకలోని హమ్నాబాద్లో రెండు చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. లారస్, న్యూలాండ్, దివీస్ ల్యాబ్స్, ఆర్తి డ్రగ్స్ తదితరాలను ప్రత్యర్ధి సంస్థలుగా భావించవచ్చు.
సాస్ సేవలతో..
సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోకు సెబీ అనుమతించింది. జూన్లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.83 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, రూ. 152 కోట్లు ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ డెవలప్మెంట్కు వెచ్చించనుంది.
మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లకు వినియోగించనుంది. కంపెనీ గతంలో 2021 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ అనుమతి లభించకపోవడం గమనార్హం! కంపెనీ ఏఐ ఆధారిత క్లౌడ్లో భాగమైన సాఫ్ట్వేర్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) రూ. 598 కోట్ల ఆదాయం, రూ. 13 కోట్ల నికర లాభం ఆర్జించింది.
లిస్టింగ్కు ఏక్వస్ రెడీ
కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, ఏరోస్పేస్ పరికరాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దీంతో ఐపీవో చేపట్టేందుకు వీలు చిక్కనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 720 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.17 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు.
ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థలు ఏరోస్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, ఏక్వస్ కన్జూమర్ ప్రొడక్ట్స్ రుణ చెల్లింపులకు, మెషీనరీ, ఎక్విప్మెంట్ కొనుగోలుకి వెచ్చించనుంది. అంతేకాకుండా ఇతర సంస్థల కొనుగోళ్లకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వినియోగించనుంది. కంపెనీ గోప్యతా మార్గంలో సెబీకి జూన్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీంతో ఐపీవోకు వీలుగా మరోసారి అప్డేటెడ్ పత్రాలు అందించింది. కంపెనీలో అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్తోపాటు.. కాటమారన్, స్పర్ట గ్రూప్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ క్లయింట్లలో బోయింగ్, బోయింగ్, బంబార్డియర్, జీకేఎన్ ఏరోస్పేస్, హనీవెల్, ఈటన్ తదితర దిగ్గజాలున్నాయి.