
ముంబై: దేశంలో నిరుద్యోగ గణంకాలను ఇకపై ప్రతి నెలా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తుండడం గమనార్హం.
మే 15న ఈ ఏడాది మొదటి మూడు నెలల గణాంకాలను విడుదల చేయనున్నట్టు, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా ప్రకటించనున్నట్టు గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. మన దేశంలో నిరుద్యోగ గణాంకాల సేకరణకు సంబంధించి సరైన వ్యవస్థ లేకపోవడం గమనార్హం.
ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు విడుదల చేస్తున్నది కూడా పట్టణ నిరుద్యోగం గురించే. గ్రామీణ నిరుద్యోగ గణాంకాలను ఏడాదికోసారి ప్రకటిస్తోంది. అసంఘటిత రంగం డేటాను సైతం మూడు నెలలకోసారి విడుదల చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.