ట్రాక్టర్‌ విక్రయాలు.. రికార్డ్‌!  | Tractor sales in India will reach 9. 75 lakh units in the fiscal year 2026 | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ విక్రయాలు.. రికార్డ్‌! 

Apr 24 2025 5:43 AM | Updated on Apr 24 2025 5:43 AM

Tractor sales in India will reach 9. 75 lakh units in the fiscal year 2026

2025–26లో 9.75 లక్షల యూనిట్లు 

5 శాతం వరకు పెరగొచ్చు 

సాగు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్‌ 

క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లకు బలమైన డిమాండ్‌ ఉంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా. కీలక పంటలకు అధిక మద్దతు ధరలకుతోడు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్, పాత వాహనాలను మార్చడం, సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న అంచనాలతో క్రిసిల్‌ రేటింగ్స్‌ అ అంచనాకు వచి్చంది. 2025–26లో ట్రాక్టర్ల విక్రయాలు 9.75 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 3–5 శాతం వరకు పెరుగుతాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో రూ.4,000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాల్నుట్టు తెలిపింది.

 ప్రస్తుత తయారీ సామర్థ్యంలో వినియోగం 75–80 శాతానికి చేరుకోవడం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు మద్దతు మూలధన నిధుల వ్యయాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు ‘టర్మ్‌ 5’ 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ట్రాక్టర్ల ముందస్తు కొనుగోళ్లు ఊపందుకోవచ్చని కూడా క్రిసిల్‌ అంచనా వేసింది. కనుక 2022–23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ట్రాక్టర్ల గరిష్ట విక్రయాలు 9.45 లక్షల యూనిట్ల మార్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు అధిగమించొచ్చని పేర్కొంది. 2024–25లో ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది.  

వర్షపాతం అంచనాలతో సానుకూల సెంటిమెంట్‌ 
‘‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ భారత వాతావణ శాఖ వేసిన అంచనాలు గ్రామీణ సెంటిమెంట్‌ను బలపరుస్తాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ట్రాక్టర్లు సహా సాగుపై పెట్టుబడులకు ఇది కీలకంగా పనిచేస్తుంది’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేతి తెలిపారు. కీలక పంటలకు కనీస మద్దతు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే నిర్మాణ రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు సానుకూలిస్తాయన్నారు. 

ముఖ్యంగా 2026 ఏప్రిల్‌ 1 నుంచి టర్మ్‌ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండడంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని.. ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13–13.5 శాతం స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. వర్షాల్లో తాత్కాలిక అవాంతరాలు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయాలపై దీని ప్రభావం, కమోడిటీల ధరలు, వడ్డీ రేట్లు, కాలుష్య ఉద్గారాల నిబంధనల అమలు ప్రభావం వంటివి మధ్య కాలానికి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement