టెలికం కంపెనీలు ఆదాయం పరంగా మార్చి క్వార్టర్లో మరో రికార్డు నమోదు చేశాయి. మార్చి త్రైమాసికంలో రూ.1.05 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఇవి ఆర్జించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో (రూ.98,250 కోట్లు) పోల్చితే 6.9 శాతం అధికంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు ట్రాయ్ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది.
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) మార్చి క్వార్టర్లో 9.45 శాతం పెరిగి రూ.86,716 కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.79,226 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించిన లైసెన్స్, స్పెక్ట్రమ్ ఫీజులు కూడా కలిపినదే ఏజీఆర్. మొత్తం ఏజీఆర్లో 83.59 శాతం వాటా టాప్-3 సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల నుంచే సమకూరింది.
ఇందులో రూ.32,468 కోట్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది. రూ.28,773 కోట్లతో భారతీ ఎయిర్టెల్, రూ.8,195 కోట్లతో వొడాఫోన్ ఐడియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ ఏజీఆర్ మాత్రం 6.19 శాతం తగ్గి రూ.2,101 కోట్లుగా ఉంది. ఎంటీఎన్ఎల్ ఏజీఆర్ రూ.333 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వానికి లైనెన్స్ ఫీజుల ఆదాయం 9.41 శాతం పెరిగి రూ.6,936 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ 1.68 శాతం పెరిగి రూ.1,017 కోట్లు సమకూరింది.


