టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకి కేంద్రం భారీ ఊరటనిచ్చింది. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీలను పునసమీక్షించిన తర్వాత 27 శాతం మేర తగ్గించింది. దీనితో కంపెనీ కట్టాల్సిన బాకీ రూ.64,046 కోట్లకు దిగివచ్చింది. దీన్ని చెల్లించేందుకు అయిదేళ్ల మారటోరియం కూడా లభించింది. అటుపైన పదేళ్ల వ్యవధిలో రెండు రకాలుగా చెల్లించాల్సి ఉంటుంది.
2031–32 నుంచి 2034–35 వరకు ఏటా కనీసం రూ.100 కోట్లు చొప్పున కట్టాలి. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని 2035–36 నుంచి 2040–41 మధ్య కాలంలో ఆరేళ్ల వ్యవధిలో ఏటా సమాన వాయిదాల్లో చెల్లించాలి. కంపెనీ కట్టాల్సిన బాకీలను కొన్నాళ్లు ఫ్రీజ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ 2025 డిసెంబర్ 31న ప్యాకేజీనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి సంస్థ కట్టాల్సిన మొత్తాన్ని రూ. 87,695 కోట్లుగా నిర్ణయించారు.
అయితే, మరోసారి మదింపు చేసిన మీదట తుది మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను టెలికం శాఖకు (డాట్) కమిటీ అప్పగించారు. తాజాగా డాట్ కమిటీ ఈ మేరకు బాకీలను ఖరారు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది.
ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్


