కొత్త వారిని ఆకర్షించడంలో ఎయిర్టెల్ టాప్
భారతీ ఎయిర్టెల్ కొత్త చందాదారులను ఆకర్షించడంలో ఏప్రిల్లోనూ ముందు నిలిచింది. 34.82 లక్షల కొత్త కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇందులో 31.39 లక్షలు వైర్లెస్ (మొబైల్) విభాగం నుంచి ఉన్నారు. ఇదే నెలలో జియో 30.84 లక్షల కొత్త కస్టమర్లను ఆకర్షించి రెండో స్థానంలో నిలిచింది. ఇందులో 29.42 లక్షల మంది మొబైల్ చందాదారులు ఉన్నారు. ఏప్రిల్లో టెలికం చందాదారులు నికరంగా 69.5 లక్షలు పెరిగి 133.75 కోట్లకు చేరినట్టు ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వొడాఫోన్ ఐడియా 53,257 మంది కొత్త కస్టమర్లను తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకుంది. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కిందకు కొత్తగా 76,175 మంది వచ్చి చేరారు. వైర్లైన్ కస్టమర్ల సంఖ్య మార్చి చివరికి 4.82 కోట్లుగా ఉంటే, ఏప్రిల్ చివరికి 4.85 కోట్లకు పెరిగింది. ఇక మొత్తం మీద 52.69 కోట్ల చందాదారులతో పరిశ్రమలో రిలయన్స్ జియో నంబర్–1 స్థానంలో ఉంది. 37.3 కోట్ల మంది చందాదారులతో ఎయిర్టెల్, 12.8 కోట్ల మంది చందాదారులతో వొడాఫోన్ ఐడియా, 2.7 కోట్ల మంది చందాదారులతో బీఎస్ఎన్ఎల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ కనెక్షన్ను ఒక సబ్స్క్రయిబర్గా పరిగణిస్తుంటారు.
‘ప్రయారిటీ’ వల్ల ప్రీపెయిడ్ సేవల నాణ్యత తగ్గదు: ఎయిర్టెల్
పోస్ట్పెయిడ్ యూజర్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ప్రయారిటీ’ సర్వీస్ వల్ల ప్రీపెయిడ్ యూజర్లకు అందించే సేవల నాణ్యత తగ్గదని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తెలిపింది. నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు ఇది విరుద్ధం కాదని స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావేశంలో కంపెనీ ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెరుగైన సేవలను అందించడానికి 5జీ ఫీచర్లను ఉపయోగించకపోనివ్వడం వల్ల రాబోయే 6జీ సేవలకు విఘాతం కలుగుతుందని సంస్థ పేర్కొంది. అధికంగా చెల్లించే పోస్ట్పెయిడ్ యూజర్లకు రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో కూడా మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు నెట్వర్క్లోని కొంత భాగాన్ని ప్రత్యేకంగా కేటాయించేలా మే 19న ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు


