
టీ రూ.10, కాఫీ రూ.20 అనే ధరలు వింటుంటే ఆ ఏముంది? రోడ్డు పక్కన టీ బండిలో రేట్లు అవే కదా అందులో వింతేముంది?.. అనిపించవచ్చు కానీ... ఆ రేట్లు ఎయిర్పోర్ట్లోని కేఫ్లో అంటే..మాత్రం విస్తుపోవాల్సిందే. అవును మరి.. రాబోయే కొన్నేళ్లలో విమానాలు ఎక్కని వారు అంటూ ఉండరేమో కానీ.. విమానాశ్రయాల్లో టీ కూడా తాగని వారు మాత్రం బోలెడంత మంది ఉంటారేమో అనే అంచనాలు ఉండేవి. ఎందుకంటే..రాను రాను విమానయానం అందుబాటులోకి వస్తోంది. కానీ ఎయిర్పోర్ట్స్లో కనీసం టీ కూడా అందుబాటు ధరలో ఉండడం లేదు కాబట్టి.
అడపాదడపా ఎయిర్లైన్స్ వాళ్లు అందించే ఆఫర్లు ఒక్కోసారి రైలు ఛార్జీల కన్నా కూడా తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల సామాన్యులకు కూడా విమాన ప్రయాణం సాధ్యమవుతోంది. కానీ విమానాశ్రయాల్లో కాసింత సేద తీరాలని టీ, కాఫీ లాంటివి తాగాలనుకున్నా, సమోసా, బిస్కెట్స్ వంటి చిరు తిండి తినాలన్నా అదేదో పెద్ద కలలాగా మారింది. ఎందుకంటే ఆ ధరల పట్టీ ఇంకా సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంది. మన శంషాబాద్ విమానాశ్రయాల వంటి చోట అయితే కేఫ్స్లో ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు తిరుగుతాయ్.
రకరకాల అవకాశాలవల్ల.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనో విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా తప్పడం లేదు. అయినప్పటికీ విమాన ప్రయాణీకులు అంటేనే సంపన్నులు అనే రీతిలో ఈ ధరలు ఉండడం సామాన్యులకు మింగుడు పడని పరిస్థితి.
ఈ నేపథ్యంలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘ఉడాన్ యాత్రి కేఫే’ అనే సేవను ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఇప్పటికి ఎదురు చూసిన రోజులు ముగిశాయి టీ రూ.10, కాఫీ రూ.20 కి పూణే విమానాశ్రయంలో అందుబాటులోకి రాబోతున్నాయి,‘ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: దుబాయ్లో భారతీయ బిలియనీర్కు ఐదేళ్లు జైలు శిక్ష
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేఫేని ఏర్పాటు చేశారు.. ఈ కేఫే లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే పూణే విమానాశ్రయంలో, ఈ విధంగా తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఆహార పదార్థాలు అందుబాటులోకి రావడం ఒక సమయోచిత మార్పుగా భావిస్తున్నారు ప్రయాణికులు. సమోసా తదితర తినుబండారాలు సైతం రూ.20 ధరల్లో అందిస్తున్న ఈ కేఫ్స్ కోల్కతా, చెన్నై, ముంబయిలలో కూడా సేవలు అందిస్తున్నాయి. విమానాశ్రయాలు సంపన్నులుకు తప్ప సామన్యులకు కావనే అభిప్రాయాలను మార్చేలా, అత్యధిక జనాభాకు ఉపయోగపడేలా ఇలాంటి మార్పులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రావాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్నారు.